పవిత్రమైన రంజాన్ నెలలోనే ఖురాన్ గ్రంథం అవతరించిందట!
పవిత్రతే పరమపదసోపానంగా ముస్లిం సోదరులు భావించే మాసం రంజాన్. రంజాన్ మాసంలో పసిపిల్లలనుంచి పెద్దవారి వరకు హృదయాలు పవిత్ర భావనతో నిండిపోతాయి. మానవాళికి ముక్తి మార్గాన్ని చూపించేందుకు దైవం పంపిన పరమ పవిత్
Publish Date: Sat, 09 Jun 2018 (21:19 IST)
Updated Date: Sat, 09 Jun 2018 (21:27 IST)
పవిత్రతే పరమపదసోపానంగా ముస్లిం సోదరులు భావించే మాసం రంజాన్. రంజాన్ మాసంలో పసిపిల్లలనుంచి పెద్దవారి వరకు హృదయాలు పవిత్ర భావనతో నిండిపోతాయి. మానవాళికి ముక్తి మార్గాన్ని చూపించేందుకు దైవం పంపిన పరమ పవిత్రమైన "ఖురాన్" గ్రంధం అవతరించిన మాసమిది. అందుకే ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది.
ఆత్మ ప్రక్షాళనకు త్రికరణశుద్ధితో ఉపవాసం ఉండడమే ఏకైక మార్గమని బోధించిన దేవుని ఆదేశానుసారం నెల పొడుపును చూసిన తరువాత సూర్యోదయ సమయంలో జరుపుకునే 'సహరీ'తో ఉపవాసాలు ప్రారంభమవుతాయి. ఈ ఉపవాస వ్రతాన్నే "రోజా" అంటారు.
ఈ మాసంలో నమాజులు, ఉపవాసాలు నియమానుసారంగా జరుగుతాయి. ఈ ఉపవాసాల వలన మానవాళి చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది. ఆకలి కోసం అలమటించే వారి బాధలను స్వయంగా అనుభవించడమే ఈ ఉపవాసాల ఉద్దేశం. దీనివల్ల ఉపవాసం ఉన్న వారిలో సాటివారిపట్ల సానుభూతితోపాటు దైవచింతన కూడా కలుగుతుందని భావన.
రంజాన్ నెల మొత్తం ముస్లిం సోదరులు రాత్రి వేళ "తరావీహ్" నమాజును నిర్వహిస్తారు. ప్రతి వంద రూపాయలకు రెండున్నర రూపాయల చొప్పున పేదలకు "జకాత్" పేరుతో దానం చేస్తారు. "ఫిత్రా" రూపంలో పేదలకు గోధుమ పిండిని దానం చేస్తారు.
జకాత్, ఫిత్రాల పేరుతో అన్నార్తులకు వితరణ చేయడం పుణ్యాన్నిస్తుంది. మహమ్మద్ ప్రవక్త బోధించిన నియమాలను అనుసరించి ప్రతి రోజూ సూర్యోదయంలో జరిపే "సహరి" నుండి, సూర్యాస్తమం వరకు జరిపే "ఇఫ్తార్ వరకు మంచి నీళ్ళను సైతం త్యజించి కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. అతిథులు, అభ్యాతుల సాంగత్యంలో సహరీలు ఇఫ్తార్లు జరుపుకుంటారు.
ఉపవాస వ్రతాలను ఆచరించడంవల్ల మనుషుల్లో వారి వారి దైనందిన జీవితాల్లో తప్పకుండా మార్పులు సంభవిస్తాయి. గతంకంటే వారు ఎంతో పవిత్రంగా, శాంతికాముకులుగా పరివర్తన చెందుతారు.