'రంజాన్' పండుగను శనివారమే జరుపుకోవాలి: ముస్లిం పెద్దలు
ప్రపంచ వ్యాప్తంగా మహమ్మదీయులు జరుపుకునే పండుగ రంజాన్ లేదా రమదాన్. ఆద్యంతం సేవా తత్పరతను ప్రబోధించే ఈ పండుగను పేద, ధనిక తేడా లేకుండా అత్యంత భక్తి ప్రవత్తులతో జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి పండుగ నమాజును ఊరిబయట నిర్ణీత ప్రదేశాలైన మసీదులలో చేస్తారు.అనంతరం ఒకరికొకరు 'ఈద్ముబారక్ ' (శుభాకాంక్షలు) తెలుపుకుంటారు. ఈ నమాజ్ కోసము వెళ్లే ముస్లిం సోదరులు ఒక దారిన వచ్చి మరో దారిన వెళ్తారు. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ను ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు. ఇంకా రంజాన్ మాసంలో జరిగే ' ఇఫ్తార్ విందు'ల్లో ఆత్మీయత సహృద్భావాలు ప్రస్ఫుటమవుతాయి. పరస్పర ధోరణికి , విశాల ఆలోచనా దృక్పథానికి ఇవి నిదర్శనం. ఈ విధంగా పవిత్ర ఆరాధనలకు ధార్మిక చింతనకూ, దైవభీతికి, క్రమశిక్షణకూ, దాతృత్వానికి రంజాన్ నెల ఆలవాలం అవుతుంది. మనిషి సత్ర్పవర్తన దిశలో సాగడానికి మహమ్మద్ ప్రవక్త బోధించిన మార్గాన్ని ' రంజాన్' సుగమం చేస్తుంది. తెలుగు వారి మాదిరిగానే ముస్లింలు 'చాంద్రమాన కేలండర్' ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్', దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే.కాగా.. ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని శనివారమే జరుపుకోవాలని జామా మసీదు సాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ ప్రకటించారు. గురువారం ఏ ప్రాంతంలోనూ చంద్రుడు కనిపించలేదని బుఖారీ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో శనివారమే రంజాన్ నిర్వహిస్తున్నట్లు ఫతేపురి మసీదు సాహి ఇమామ్ ముఫ్తీ మహమ్మద్ ముకరం అహ్మద్ కూడా తెలిపారు.