జర్మనీ దక్షిణ భాగంలోని మ్యునిచ్ రైల్వేస్టేషన్లో ఉగ్రవాద సంచారం ఎక్కువైందని వార్తలొస్తున్నాయి. ఇందుకు తాజా ఘటనే నిదర్శనమైంది. మంగళవారం జర్మనీ దక్షిణ భాగంలోని మ్యునిచ్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి అల్లాహో అక్బర్ అని గట్టిగా అరుస్తూ.. ప్రయాణీకులపై కత్తితో దాడి చేస్తూ పారిపోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
రైల్వేస్టేషన్లో మంగళవారం తెల్లవారుజామున రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు ఈఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో కత్తిపోటుకు తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని స్థానిక రేడియో వెల్లడించింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినట్లు సమాచారం.
అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించాయి. ఈ ఘటనతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఐసిస్పై పోరుకు మద్దతిస్తున్న జర్మనీ ఇప్పటివరకు పొరుగు దేశాలైన ఫ్రాన్స్, బెల్జియంలాగా ఎలాంటి ఉగ్రదాడులకు గురి కాలేదు. అయితే తాజా ఘటనతో ఐసిస్ జర్మనీపై కన్నేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.