హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాక్ శనివారం మరణించారు. ఆయన వయసు 95 ఏళ్లు. ప్రపంచాన్ని ఆకలి బాధ నుంచి తప్పించి కోట్లాది మందిని కరువు కోరల నుంచి బయటపడేసిన బోర్లాగ్కు వ్యవసాయ రంగానికి చేసిన విశేష సేవలకుగానీ 1970లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.
ప్రపంచవ్యాప్తంగా పంట దిగుబడులను గణనీయంగా పెంచిన హరిత విప్లవానికి ఆద్యుడైన బోర్లాగ్ రోగ నిరోధక గోధుమను కూడా కనిపెట్టారు. దీని కారణంగా భారత్లో గోధుమ దిగుబడి రెట్టింపయింది. భారత్, పాకిస్థాన్లతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆహార కొరతను తీర్చిన ఘనత బోర్లాగ్కే దక్కుతుంది.
కేన్సర్తో బాధపడుతున్న నార్మర్ బోర్లాగ్ శనివారం టెక్సాస్లోని డల్లాస్ నగరంలో కన్నుమూశారని టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. వ్యవసాయ రంగానికి ఆయన చేసిన సేవలకు నోబెల్ శాంతి బహుమతితోపాటు, ప్రతిష్టాత్మక కాంగ్రెస్ గోల్డ్ మెడల్, భారత ప్రభుత్వ పద్మవిభూషణ్, పలు ఇతర అవార్డులు లభించాయి.
బోర్లాగ్ తన హరిత విప్లవ పరిశోధనా ఫలాలతో 20వ శతాబ్దం మధ్యకాలంలో ప్రపంచాన్ని కుదిపేసిన కరువు నుంచి కోట్లాది మంది పౌరుల ఆకలిచావులను తప్పించారు. హరిత విప్లవం కారణంగా 1960-90 మధ్యకాలంలో ప్రపంచ ఆహార దిగుబడులు రెట్టింపయ్యాయి. భారత్, పాకిస్థాన్, మెక్సికో దేశాలు దీని కారణంగా ఎంతో లాభపడ్డాయి.