Publish Date: Sat, 16 May 2020 (13:03 IST)
Updated Date: Sat, 16 May 2020 (19:19 IST)
వేసవిలో లభించే ముఖ్యమైన పండు పనస. పసిమి ఛాయతో చూడటానికి కనులకు ఇంపుగా చూసిన వెంటనే తినాలనిపించేలా ఉండేలా పనస తొనలు తియ్యగా ఉండడమే కాకుండా మురబ్బాలు, కాండీలు, పనస పాయసం వంటి మరెన్నో రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. అయితే పనస వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పనస గింజలతో వేపుడు కూరలు, మసాల కూరలు చేసుకోవచ్చు. పనస పండు కోసిన తరువాత పైన గరుకుగా ఉండే పొట్టు లోపలి పీచును తీసివేసి మిగిలిన కండను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటితో తీపికూర, మసాలా కూర, పులుసు చేసుకోవచ్చు. పనస గింజల్లో పిండి పదార్థం అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పనసపొట్టు కూరతో పాటు పనస గింజలు కూడా కూరగా చేసుకోవచ్చు. విటమిన్ సి అధికంగా ఉన్న పనసలో క్యాలరీలతో పాటు మరెన్నో ఔషధగుణాలు ఉన్నాయట. పనస తొనలలో ఉండే జాక్ లైన్ పదార్థం రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుందట. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపిస్తున్న పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి అవసరం కాబట్టి ఖచ్చితంగా పనసను తీసుకుంటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.