Publish Date: Fri, 12 Oct 2018 (16:58 IST)
Updated Date: Fri, 12 Oct 2018 (17:02 IST)
చాలామంది ప్రతి చిన్న విషయానికి కోప్పడతారు. దీంతో నలుగురు నోళ్ళలో కి చెడుగా కనిపిస్తుంటారు. ప్రతి చిన్న విషయానికి కోపగించుకున్నా... శారీరక ఉద్వేగాలకులోనైనా అనారోగ్య సమస్యలబారిన పడుతుంటారు.
కోపాన్ని అణుచుకోవడం కంటే.. అసలు కోపం తెచ్చుకోకుండా శరీరాన్ని సమాయత్తం చేసుకోవడం ఉత్తమం. ఇందుకు ధ్యానం ముఖ్య సాధనం. ప్రతి రోజూ ఉదయాన్నే అర్థగంట నడకతో మొదలు పెట్టి.. 40 నిమిషాలపాటు యోగా చేసి.. మరో 15 నిమిషాలు ధ్యానం చేయడం ఉత్తమం. ఇలా సాధన చేయడం వల్ల మనసు నిగ్రహించుకునే శక్తిని పొందుతుంది.
అలాగే, ఉదయం ఎంత ఆహ్లాదంగా ఉంటే.. ఆ రోజు అంతే ప్రశాంతంగా గడుస్తుంది. ఇక, ఆహారాన్ని మార్చుకోక తప్పదు. ఉద్రేకాలను ప్రేరేపించే మసాలాలు, ఉప్పు, కారం తగ్గించుకోవాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి.
కాలానికి అనుగుణంగా ఆహారం తీసుకోవాలి. ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో అయితే రోజూ కీరా ముక్కలు, పుచ్చకాయ, టొమాటో రసం, ఫ్రూట్ సలాడ్స్, పల్చటి మజ్జిగ తీసుకోవాలి. వీలైనంత మేరకు మంసాహారం తగ్గించాలి.
ధూమపానం, మద్యం కూడా ఉద్రేకాలకు కారణం అవుతాయి. ఇక, కోపతాపాలకు నిద్రాభంగం కూడా ఒక కారణం. సుఖవంతమైన నిద్ర కరువైతే చికాకులు ఎక్కువవుతాయి. నిద్రను మాత్రం దూరం చేసుకోవద్దు. ఇలాంటివి చేయడం వల్ల మనసుని నిగ్రహంగా ఉంచుకోవడమే కాకుండా, ప్రశాంతంగా జీవించవచ్చు.
webdunia
Publish Date: Fri, 12 Oct 2018 (16:58 IST)
Updated Date: Fri, 12 Oct 2018 (17:02 IST)