Publish Date: Thu, 07 Feb 2019 (22:39 IST)
Updated Date: Thu, 07 Feb 2019 (22:45 IST)
రావి చెట్టు అనేక ఔషధ విలువలకు నిలయం. అనేక రోగాలను మాయం చేసే శక్తి రావి ఆకులకు ఉంది. ఆస్తమా, చర్మ వ్యాధులు, కిడ్నీ జబ్బులు, మలబద్ధకం, విరేచనాలు, లైంగిక సమస్యలు, పాము కాటు తదితర సమస్యలకు ఇది మందుగా ఉపయోగపడుతుంది. దీనిలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
1. ఆకలి పెంచడానికి బాగా పక్వానికి వచ్చిన రావి పండ్లు ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల దగ్గు, రక్త సంబంధ సమస్యలు, పిత్త దోషాలు, కడుపులో మంట, వాంతులు కూడా తగ్గుతాయి.
2. అధిక బరువుతో బాధపడేవారు నాలుగు రావిఆకులను గ్లాసున్నర నీటిలో వేసి ఒక గ్లాసు నీరు అయ్యే వరకు మరిగించి తాగడం వల్ల బరువు తగ్గుతారు.
3. ఎండిన రావి పండ్లను పొడిగా చేసుకొని రోజూ రెండు పూటలా 2-3 గ్రాముల చొప్పున రెండు వారాలపాటు తీసుకోవాలి. ఇలా చేస్తే ఆస్తమా త్వరగా తగ్గుతుంది
4. నపుంసకత్వం సమస్య నుంచి బయటపడటానికి కూడా రావి ఉపయోగపడుతుంది. అర స్పూన్ రావి పండ్ల పొడిని పాలలో కలిపి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. తద్వారా శరీరానికి బలం వచ్చి, నపుంసకత్వం నుంచి బయటపడొచ్చు. తగిన మోతాదులో రావి పండ్లు, దాని వేర్లు, శొంఠిని కలపాలి. పాలు, తేనె, పట్టిక మిశ్రమానికి దీన్ని కలిపి తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
5. రావి పండ్లను, ఆకులను మలబద్దకం తగ్గించడానికి కూడా ఉపయోగించవచ్చు. ఆకులను ఎండబెట్టి వాటిని పొడిగా చేయాలి. దానికి సోంపు గింజలు, బెల్లం సమపాళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసు నీళ్లలో కలిపి తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. రోజుకు 5-10 రావి పండ్లను తిన్నా సమస్య పూర్తిగా దూరం అవుతుంది.
6. రక్త శుద్ధి కోసం కూడా రావి ఎంతగానో ఉపయోగపడుతుంది. రెండు గ్రాముల రావి గింజల పొడిని తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది.
7. పాము కాటుకు గురైన వారికి రావి ఆకుల రసాన్ని రెండు స్పూన్ల చొప్పున మూడు నాలుగు సార్లు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల విషం ప్రభావం తగ్గుతుంది.
8. డయేరియా తగ్గడానికి రావి చెట్టు కాండం ఉపకరిస్తుంది. రావి చెట్టు కాండం, ధనియాలు, పట్టిక బెల్లం సమపాళ్లలో తీసుకొని బాగా మిక్స్ చేసి 3-4 గ్రాముల చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకుంటే డయేరియా తగ్గుతుంది.