ఎండ్రకాయలు, రొయ్యల కర్పరం (డొప్ప)లతో నాడీ చికిత్సను చేయవచ్చునని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం తాజా అధ్యయనంలో కనుగొన్నారు. ఈ పద్ధతి ప్రకారం ఎండ్రకాయలు, రొయ్యల డొప్పలలో లభించే ఖైటోసాన్ అనే రసాయనాన్ని పారిశ్రామిక పాలియెస్టర్తో కలిపి కృత్రిమ నాడులను తయారు చేసే విధానాన్ని కనుగొన్నట్లు పరిశోధకులు తెలిపారు.
ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకుడు మికిన్ జాంగ్ మాట్లాడుతూ... ఇప్పటిదాకా ప్రమాదవశాత్తూ శరీరంలోని ఏదేని భాగంలో నాడులు దెబ్బతిన్నట్లయితే, రక్తనాళాల మాదిరిగా మార్చేసేందుకు నాడులకు ప్రత్యామ్నాయ మార్గాలేవీ లేవని అన్నారు.
నాడీ ఇంప్లాంట్స్ను తయారు చేసేందుకు చాలా ప్రత్యేకమైన పదార్థం అవసరమవుతుందనీ, ఆ పదార్థం జీవ వ్యవస్థలతో సంబంధం కలిగి ఉండేదిగా ఉండాలని జాంగ్ పేర్కొన్నారు. ఆ పదార్థం రకరకాల ద్రావణాలతో కలసినా ఎలాంటి మార్పులూ చెందకుండా ఉండాలని, సులభంగా విరగకుండా ఉండాలన్నారు. అయితే ఇన్ని లక్షణాలుండే పదార్థం దొరకడం కష్టసాధ్యమని జాంగ్ తెలిపారు.
అయితే ఎండ్రకాయ, రొయ్యల డొప్పల నుంచి లభించే ఖైటోసాన్ రసాయనాన్ని, పారిశ్రామిక పాలియెస్టర్తో కలిపి కృత్రిమ నాడులను తయారు చేసే పద్ధతిని తాము పరిశోధనల్లో కనుగొన్నట్లు జాంగ్ వెల్లడించారు. ఇందులో భాగంగా తమ పరిశోధకుల బృందం ఎండ్రకాయ డొప్ప నుంచి లభించే ఖైటోసాన్, సూటర్స్ (ఆపరేషన్ అనంతరం కుట్లు వేసేందుకు ఉపయోగించే దారం) తయారీకి ఉపయోగించే పాలియెస్టర్తో కలిపి ఓ సరికొత్త సమ్మేళనాన్ని రూపొందించినట్లు జాంగ్ చెప్పారు.
ఇందుకోసం "ఎలక్ట్రో స్పిన్నింగ్" అనే అత్యాధునిక పద్ధతిని కూడా ఉపయోగించినట్లు జాంగ్ తెలిపారు. అయితే ఈ రెండు పదార్థాలను నిర్ణీత పాళ్లలో కలిపితేనే ప్రయోజనం ఉంటుందనీ, లేకపోతే నాడీ ఇంప్లాంట్స్ చాలా బలహీనంగా తయారవుతాయన్నారు.
ఇదిలా ఉంటే... ఖైటోసాన్, పాలియెస్టర్ సమ్మేళనం చాలా దృఢంగా ఉంటుందనీ... అంతేగాకుండా, దానికి కావాల్సిన విధంగా సులభంగా మార్పు చేసుకునే వీలుంటుందని మికిన్ జాంగ్ వివరించారు. తాము రూపొందించిన కృత్రిమ నాడులను శరీరంలోని అన్ని భాగాల్లోనూ ఏర్పాటు చేయవచ్చునని తెలియజేశారు.