ఉరుకుల పరుగుల జీవితాలతో మమేకమైన నేటి ఆధునిక కాలంలో... ప్రేయసి లాంటి పట్టణాన్నే కాకుండా, తల్లిలాంటి పల్లెసీమలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనుకున్నారీయన. అలా అనుకోవడమేకాదు తన అకుంఠిత దీక్షతో నెలల తరబడీ పల్లెల్లో తిరిగారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి పరుగులెత్తారు, అందుకు కారణమైన లోతుపాతుల్ని తరచి చూశారు. అక్షరబద్ధం చేసి మరీ పాలకుల, ప్రజల దృష్టికి తెచ్చారు. ఆయనే ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్.పి. సాయినాథ్ పేరు వింటే రాయలసీమలోని రాళ్లకు కూడా ప్రాణం లేచివస్తుంది. పత్రికా విలేకరిగా గ్రామీణ పేదలకు ప్రాతినిధ్యం వహించి, వారి కష్టాలను వెలుగులోకి తెచ్చేందుకు విశేషమైన కృషి సల్పిన ఈ రైతు బాంధవుడిని ప్రభుత్వం 2007వ సంవత్సరం, జూలై 31వ తేదీన "రామన్ మెగసెసె" అవార్డుతో సత్కరించింది. అలా జూలై 31వ తేదీకి ప్రాముఖ్యాన్ని సంతరించిపెట్టిన సాయినాథ్ గురించి కాసిన్ని విషయాలు...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పేరుపొందిన కుటుంబం నుండి వచ్చిన పి. సాయినాథ్ మాజీ రాష్ట్రపతి వి.వి. గిరి మనవడు. ఈయన మద్రాసులోని లయోలా కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడే ఈయనకు సామాజిక రుగ్మతలు, రాజకీయ కోణాలకు సంబంధించిన ఆసక్తి ఏర్పడింది. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చదువుతుండగా పలు విద్యార్థి రాజకీయ ఉద్యమాలలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు.రైతుల గురించే రాస్తాననీ...!!
భారతదేశంలోని పత్రికలన్నీ పైనున్న ఐదు శాతం మందిని గూర్చి రాస్తే... తాను కిందనున్న ఐదుశాతం మంది గురించే రాస్తానని బహిరంగంగానే ప్రకటించే ధైర్యం ఆయన సొంతం. పాలమూరు వలసలూ, అనంతపురంలో రైతుల ఆత్మహత్యలూ అంతర్జాతీయ సమాజం దృష్టికి రావడానికి సాయినాథ్ రచనలే....
జవహర్లాల్ యూనివర్సిటీలోనే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా పనిచేసిన పి. సాయినాథ్... మాస్టర్ డిగ్రీని సాధించిన తరువాత పత్రికా విలేకరిగా జీవితం ప్రారంభించారు. అయితే జర్నలిస్ట్ అని పిలిపించుకునేకన్నా, పల్లె రిపోర్టరు లేదా రిపోర్టరు అని పిలిపించుకునేందుకే ఈయన ఎక్కువ ఇష్టపడుతుంటారు. పల్లె రైతులు, పేదరికం లాంటి విషయాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఎంతగానో కృషి చేసిన సాయినాథ్... సంవత్సరంలో దాదాపు 270-300 రోజులు పల్లెల్లోనే జీవనం గడుపుతున్నారు. హిందూ పత్రికలో గ్రామీణ వ్యవహారాల ఎడిటర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈయన... వివిధ రాష్ట్రాలలో కొనసాగుతున్న ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు, దళితులపై అత్యాచారాలు వెలుగులోకి తేవటంలో విశేష కృషి సల్పారు.అంతేకాకుండా... ఐదు రాష్ట్రాలలోని పది అతి పేద జిల్లాలలో జీవన ప్రమాణాలను నివేదించటానికి చేసిన ప్రయాణంలో భాగంగా సాయినాథ్ 5వేల కిలో మీటర్లు కాలి నడకన పర్యటించారు. పత్రికలు ఆర్థిక సహాయం ఇక అందించలేమని అన్నప్పుడు కూడా ఆయన వెనుకడుగు వేయకుండా తన సొంత డబ్బును ఖర్చుపెట్టి ముందుకు సాగారు.
తన కథనాల ద్వారా గ్రామీణ భారతంలోని పేదరికాన్ని, వ్యవసాయ సంక్షోభాన్ని యావద్దేశానికి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు సాయినాథ్. తను నష్టపోతూ ఆహారాన్ని పండిస్తున్న రైతుకి తప్పక సబ్సిడీలు యివ్వాలని... సబ్సిడీలు ఎత్తివేయటం కంటే విద్య, వైద్య, రవాణా వంటి మౌలిక సదుపాయాలు మీద దృష్టి పెడితే గ్రామీణ భారతంలో ఎన్నో ఉద్యోగాలు సృష్టించటమే కాకుండా పురోగతి సాధించవచ్చునని అంటారీయన.
పాలమూరు వలసలూ, అనంతపురంలో రైతుల ఆత్మహత్యలూ అంతర్జాతీయ సమాజం దృష్టికి రావడానికి సాయినాథ్ రచనలే కారణం. వలస కూలీలుగా మారిన మహబూబ్నగర్ జిల్లా రైతులు 2000సంవత్సరంలో వారానికి ఒక బస్సులో ముంబాయి వెళ్లేవారు. 2004కి ఆ సంఖ్య 34బస్సులకు పెరిగింది. ఈ విషయాన్ని గుర్తించి ప్రపంచానికి చెప్పింది ఈయనే.
ఫ్యాషన్ షోలకు హాజరైన ధనికుల గురించి జాతీయ పత్రికలు, టెలివిజన్ ఛానళ్లలో ప్రచారం ఇస్తున్నారేగానీ... కనీస వేతనాల కోసం లక్షలమంది వ్యవసాయ కూలీలు ఢిల్లీలో ఆందోళన చేస్తే ఎవరూ పట్టించుకోలేదంటూ విమర్శించటం సాయినాథ్ నైజం. భారతదేశంలోని పత్రికలన్నీ పైనున్న ఐదు శాతం మందిని గూర్చి రాస్తే... తాను కిందనున్న ఐదుశాతం మంది గురించే రాస్తానని బహిరంగంగానే ప్రకటించే ధైర్యం ఆయన సొంతం.
ప్రఖ్యాతిగాంచిన ఆర్థిక వేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ మాటల్లో చెప్పాలంటే... ఆకలి, దుర్భిక్షంపై ప్రపంచంలోనే అత్యంత లోతుగా అధ్యయనం చేసిన నిపుణుల్లో సాయినాథ్ ఒకరు. ఈయన ఘాటు జర్నలిజం ఎంతో మంది విమర్శకులను తయారుచేసి ఉండవలసింది, కానీ ఎందుకో తనపై విమర్శలు చెప్పుకోదగినంతగా లేవు. ఎన్ని తప్పులను ఎత్తి చూపినా సాయినాథ్ వృత్తి గౌరవానికి ఎవరూ అడ్డుపడకపోవటం గమనార్హం.
2007లో జర్నలిజం, సాహిత్యం మరియు కమ్యూనికేషన్ రంగాలలో నోబెల్ పురస్కారానికి ధీటుగా పరిగణించబడే రామన్ మెగసెసె పురస్కారాన్ని గెలుచుకున్న ఒకే ఒక్క భారతీయుడిగా రికార్డు సృష్టించారు సాయినాథ్. ఈ అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా... ఒక పాత్రికేయుడిగా అంతులేని నిబద్ధతతో పనిచేస్తూ, గ్రామీణ భారత పేదల పట్ల అవగాహన పెంచి తగు చర్యలు తీసుకునేలా ముందుకు నడిపించిన ధీశాలి అంటూ ఈయనను మెగసెసె ఫౌండేషన్ కొనియాడింది.