"చీరాల పేరాల" ఉద్యమానికి నాయకత్వం వహించిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, ఆంధ్ర రత్న బిరుదాంకితులు అయిన దుగ్గిరాల అమరత్వం పొందిన రోజును చరిత్రలో జూన్ 10వ తేదీ ప్రత్యేకతగా చెప్పవచ్చు.
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జీవిత విశేషాల్లోకి వస్తే... ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2వ తేదీన జన్మించారు. ఈయన పుట్టిన మూడో రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏటన తండ్రి కోదండ రామస్వామి అశువులు బాసారు. అప్పట్నించీ చిన్నాన్న, నాయనమ్మ సంరక్షణలో పెరిగిన దుగ్గిరాల కూచిపూడి, గుంటూరులలో ప్రాథమిక విద్యను అభ్యసించారు.
హైస్కూలులో చదివే సమయంలోనే "జాతీయ నాట్య మండలి" స్థాపించిన దుగ్గిరాల.. పలు సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించారు. నాట్యమండలి పనుల్లో కొట్టుకుపోయి, చదువుపై అంతగా శ్రద్ధ చూపక పోవడంచేత ఈయన మెట్రిక్యులేషనులో ఫెయిలై, ఆపై బాపట్లలో పట్టుదలగా చదివి ఉత్తీర్ణులయ్యారు.
ఆ తరువాత నడింపల్లి నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911 సంవత్సరంలో స్కాట్లండ్లోని ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎం.ఎ విద్యను అభ్యసించారు. ఆనంద కుమార స్వామితో కలసి కొంతకాలం పనిచేసిన సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంధాన్ని సంస్కృతం నుంచి “ది మిర్రర్ ఆఫ్ గెస్టుర్”గా ఇంగ్లీషులోకి అనువదించారు. కాగా... అది 1917లో "కేంబ్రిడ్జ్-హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్" వారిచే ప్రచురితమయ్యింది.
దుగ్గిరాల స్కాట్లండ్ నుంచి తిరిగి వచ్చాకా రాజమండ్రి, బందరు ప్రాంతాలలో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసారు. అయితే వాటిలో ఇమడలేక, స్వాతంత్రోద్యమ సంగ్రామంలోకి అడుగుపెట్టారు. 1919వ సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వం చీరాల, పేరాల మునిసిపాలిటీలను విలీనం చేసినప్పుడు అందుకు వ్యతిరేకంగా జరిగిన సహాయ నిరాకరణోద్యమానికి నాయకత్వం వహించారు.
ఈ చీరాల పేరాల పోరాటాన్ని స్వాతంత్ర్యోద్యమ సంగ్రామంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా అభివర్ణిస్తుంటారు కూడా...! అలాంటి ఉద్యమానికి నాయకత్వం వహించిన దుగ్గిరాల.. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకుగానూ ఒక సంవత్సరం పాటు జైలుశిక్షను కూడా అనుభవించారు.
అదలా ఉంచితే... తెలుగునాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి దుగ్గిరాల విశేషంగా కృషిసల్పారు. 'సాధన' అనే పత్రిక నడిపిన ఆయన అందులో... తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర, జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు లాంటి జానపద కళారీతులు ప్రచారం చేశారు.
అంతేగాకుండా... రామభక్తుడైన దుగ్గిరాల "శ్రీరామదండు" అనే ఓ ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని కూడా ఏర్పాటు చేశారు. సుప్రసిద్ధమైన చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించడమేగాక, తెలుగు జానపద కళారీతుల పునరుద్ధరణకు విశేషమైన కృషి చేసిన దుగ్గిరాల 1921వ సంవత్సరంలో గుంటూరులో "ఆంధ్ర రత్న" బిరుదంతో గౌరవింపబడ్డారు.
తన జీవితకాలమంతా స్వాతంత్ర్య పోరాటానికి, జానపద కళల పునరుద్ధరణకు పాటుపడిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.. తన 40వ ఏటన 1928, జూన్ 10వ తేదీన పరమపదించారు.