వరలక్ష్మీ వ్రతం ఎలా ఆచరించాలి..?
సౌభాగ్యం, సిరిసంపదలు ప్రసాదించే వ్రతమేదైనా వుందా..? అంటూ పార్వతీదేవి ముక్కంటిని కోరింది. ఆయన వరలక్ష్మీ వ్రతం గురించి గిరిజకు చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి. పూర్వం ఉత్తమ ఇల్లాలుగా బాధ్యతలు నిర్వహి
Publish Date: Thu, 03 Aug 2017 (17:43 IST)
Updated Date: Thu, 03 Aug 2017 (17:45 IST)
సౌభాగ్యం, సిరిసంపదలు ప్రసాదించే వ్రతమేదైనా వుందా..? అంటూ పార్వతీదేవి ముక్కంటిని కోరింది. ఆయన వరలక్ష్మీ వ్రతం గురించి గిరిజకు చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి. పూర్వం ఉత్తమ ఇల్లాలుగా బాధ్యతలు నిర్వహిస్తూ.. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి.. వరలక్ష్మీ దేవి అనుగ్రహంతో.. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం పూట పూజ చేసి సిరి సంపదలను పొందినట్లు కథ చెప్తారు.
చారుమతికి స్వప్నంలో మహాలక్ష్మీ దేవి కనిపించి.. వరలక్ష్మీ వ్రతం ఆచరించాల్సిందిగా ఆదేశిస్తుంది. అమ్మవారి ఆదేశానుసారం.. చారుమతి వరలక్ష్మీ కృపకు పాత్రురాలైందని స్కాంద పురాణం చెప్తోంది. చారుమతి ఈ వ్రతాన్ని తనతో పాటు తన చుట్టుపక్కల ఉన్న కుటుంబాల స్త్రీలకు చెప్పి.. వారిని కూడా ఆ వ్రతంలో పాత్రులను చేసింది. అలా వ్రతమాచరించిన చారుమతితో పాటు మిగిలిన స్త్రీలందరూ వరలక్ష్మీ దేవి అనుగ్రహంతో సిరిసంపదలను పొందారు.
అష్టలక్ష్మీ దేవిల్లో ఒకరైన వరలక్ష్మీ దేవికి ఏ ప్రత్యేకత ఉంది. ఈమె భక్తులకు వరాలు ఇవ్వడంలో ముందుంటారు. లక్ష్మీ పూజ కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టం. అంతేగాకుండా శ్రీహరికి ఇష్టమైన, విష్ణువుకు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం చేస్తే సకల సంపదలు, నిత్యసుమంగళీ ప్రాప్తం, సకల అభీష్టాలు సిద్ధిస్తాయని విశ్వాసం.
ముత్త్తెదువులు, కన్యలు ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు. వరలక్ష్మీ వ్రతం రోజున సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగ స్నానాదులు ముగించుకోవాలి. తర్వాత నూతన వస్త్రాల్ని ధరించి పూజ కోసం నిర్ణయించిన స్థలాన్ని ఆవుపేడతో అలికి, పద్మం ముగ్గుతో తీర్చిదిద్దాలి. దానిపై పీట అమర్చి.. పీటపై బియ్యం పోసి కలశాన్ని ఉంచాలి. ఆ కలశం మీద అలంకరించాల్సిన కొబ్బరికాయను అమ్మవారి రూపంలో పసుపు కుంకుమలతో తీర్చి దిద్దాలి. కలశంపై అమ్మవారి ముఖం.. చక్కని చీర హారాలతో అమ్మవారిని అలంకరించుకోవాలి.
సాయంత్రం పూట ఇరుగు పొరుగున ఉన్న ముత్తైదువులను పేరంటానికి పిలిచి కాళ్ళకు పసుపురాసి, నుదుట కుంకుమ పెట్టి, మెడకు గంధాన్ని అద్ది గౌరవిస్తారు. ముత్త్తెదువులందరితో కలసి వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని తెలిపే కథను శ్రవణం చేస్తారు. ఇలా చేయడం ద్వారా ఆ ఇంట సిరిసంపదలు, సౌభాగ్యం వెల్లివిరుస్తుందని పండితులు చెప్తున్నారు.