Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#MahaShivaratri : శైవక్షేత్రాల్లో భక్తుల సందడి

మహాశివరాత్రి పర్వదిన వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ పర్వదినం సందర్భంగా దేశంలో ఉన్న అన్ని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దుర్గాఘాట్‌లో భక్తుల పుణ్యస్నానాలు చేస్తున్నారు. యనమలకుదురు

#MahaShivaratri : శైవక్షేత్రాల్లో భక్తుల సందడి
, మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (09:07 IST)
మహాశివరాత్రి పర్వదిన వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ పర్వదినం సందర్భంగా దేశంలో ఉన్న అన్ని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దుర్గాఘాట్‌లో భక్తుల పుణ్యస్నానాలు చేస్తున్నారు. యనమలకుదురు శివాలయంలో భారీగా భక్తులు పూజలు చేస్తున్నారు. 
 
ఇకపోతే.. మహా శివరాత్రి పూజలకు గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని కోటప్పకొండ ముస్తాబైంది. మంగళవారం ఇక్కడ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్లు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఈ తిరునాళ్లకు రాష్ట్ర పండుగ హోదా కల్పించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు దేశం నలుమూలల నుంచి సుమారు పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనా కాగా, ఇందుకు తగ్గట్టు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం తరఫున మంత్రి మాణిక్యాలరావు, స్పీకర్‌ కోడెల పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. పోలీసు భద్రత కూడా కల్పించారు. 
 
ఇకపోతే, శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, అమరావతిలతో పాటు భీమేశ్వరం, కాళేశ్వరం తదితర శైవక్షేత్రాల్లో ఇసుకేస్తే రాలనంత భక్తులు కనిపిస్తున్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత సోమస్కంధమూర్తి భక్తులను అనుగ్రహిస్తున్నారు.  ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు.
 
అలాగే, యనమలకుదురు రామలింగేశ్వర ఆలయం, కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్దకళ్లేపల్లిలోని దుర్గా నాగేశ్వరస్వామివారి ఆలయం, విజయవాడ వన్ టౌన్‌లోని శివాలయం, గుంటూరు జిల్లా సత్రశాల, ప్రకాశం జిల్లా పునుగోడు తదితర ప్రాంతాల్లోని ప్రముఖ శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళవారం మీ రాశిఫలితాలు.. అలా చేస్తే మనోవాంఛలు నెరవేరుతాయి