"అమ్మ" ప్రభుత్వ ప్రచారకర్తగా సూపర్స్టార్ రజినీకాంత్..?!!
, శనివారం, 26 నవంబరు 2011 (20:25 IST)
కొంతమంది ఏది చెప్పినా అతికేటట్లు ఉంటుంది. ఎందుకంటే వారు మామూలుగా ఏదీ చెప్పరు. ఒక్కసారి చెప్పారంటే వందసార్లు చెప్పినట్లే లెఖ్ఖ. ఇప్పుడు ఇదే టైపు లెఖ్ఖ చెప్పే రజినీకాంత్ను తమ ప్రభుత్వ పథకాల ప్రచారకర్తగా వినియోగించుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రయత్నిస్తున్నారట.ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం షారుక్ను, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు అమితాబ్ ను తమ ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుక వెళ్లేందుకు ఉపయోగించుకుంటున్నాయి. ఇదే ఫార్ములాను తమిళనాడు ప్రభుత్వం ఆచరించాలని ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇందుకుగాను రజినీకాంత్ను సంప్రదించాలనుకుంటే ప్రస్తుతం ఆయన బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటున్నారట. వచ్చే డిసెంబరు నెల 12న తన పుట్టినరోజు సందర్భంగా 11న చెన్నైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన రాగానే ఫైలును రజినీకాంత్ ముందు పెట్టేందుకు ప్రభుత్వాధికారులు సర్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.ఐతే తాజాగా జయలలిత సర్కార్ పాల ధర, బస్సు టిక్కెట్ల ధరలు పెంచేసింది. దీంతోపాటు విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో రజినీకాంత్ తమిళనాడు ప్రభుత్వ పథకాల ప్రచారకర్తగా ఒప్పుకుంటారా..? అనేది ప్రశ్న. ఇదిలావుంటే ఇప్పటికే కెప్టెన్ విజయ్కాంత్ తనదైన శైలిలో అన్నాడీఎంకే అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతున్నారు. పొరపాటును చేయి కలిపినందుకు తనకు గట్టిగా బుద్ధి చెపుతున్నారని లెంపలేసుకుంటున్నారు.