ఆ రోజు వైఎస్ వెంట "సూరీడు" లేడు.. అందుకే...
మన భారతదేశ ప్రజలు అనేక నమ్మకాలను, విశ్వాసాలను పూర్తిగా నమ్ముతారు. గ్రహరాశుల గమనాన్ని అనుసరించి తమ జీవితంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసుకునేందుకు చాలామంది ఉత్సాహపడుతుంటారు. అలాగే మంచి సమయం, రాహుకాలం, శుభ లగ్నం.. వంటివాటితోపాటు మరికొన్నింటిని కూడా వారి జీవితంలో జరిగే పరిణామాలకు ఆపాదించుకుంటూ ఉంటారు. ఏదైనా కార్యక్రమానికి బయలుదేరి వెళ్లేముందు ఎవరైనా తుమ్మినట్లయితే వెళ్లేవారు కాస్తా... తిరిగి ఇంటికి వచ్చేస్తారు. అలాగే గుమ్మం నుంచి కాలు బయటకు పెట్టేముందు పిల్లి ఎదురైతే ఆ పనిని అప్పటికి వాయిదా వేసుకుంటారు. ఇంకా ఇటువంటి నమ్మకాలు ఎన్నో ఉన్నాయి. సెప్టెంబరు 2న ముఖ్యమంత్రి మృతి వెనుక కూడా కొన్ని సెంటిమెంట్లు దాగి ఉన్నట్లు పలువురు అనుకోవడం వినిపిస్తోంది. సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ కార్యక్రమానికైనా వెళ్లేటపుడు ఆయన వెంట వ్యక్తిగత కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి ( సూరీడు) తప్పకుండా ఉంటారు. కానీ చిత్తూరు రచ్చబండ కార్యక్రమానికి వెళ్లేటపుడు ఆయన వెంట సూరీడు వెళ్లలేదు. అందువల్లనే వైఎస్ ప్రమాదానికి గురయ్యారని అంటున్నారు.దీనితోపాటు మరో వాదన కూడా షికారు చేస్తోంది. అదేమంటే... ఏ కార్యక్రమాన్నైనా ముఖ్యమంత్రి చేవెళ్ల నుంచి ప్రారంభించేవారనీ... కానీ ఈసారి చేవెళ్లను వదిలి చిత్తూరుకు మార్చుకున్నందుకే ప్రమాదం జరిగిందని అనుకుంటున్నారు. వైఎస్సార్ మృతిపై ఇటువంటి సెంటిమెంట్లు ఇంకా ఎన్నో షికారు చేస్తున్నాయి. ఈ సెంటిమెంట్లను వింటుంటే... నిజమే అనిపిస్తోందంటున్నారు వీటిని విన్నవారు. మరి మీరేమంటారూ...?