Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మద్యానికి బానిసైన కుమారుడికి మరణశాసనం లిఖించిన తల్లిదండ్రులు

crime
, మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (13:41 IST)
మద్యం, గంజాయి వంటి మత్తుకు బానిసై కుటుంబ బాధ్యతలను గాలికొదిలేసిన కన్నబిడ్డకు తల్లిదండ్రులు మరణశాసనం లికించారు. సుపారీ ఇచ్చి మరీ చంపించారు. ఈ ఘటన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో జరిగింది. 
 
పోలీసుల కథనం మేరకు.. తెలంగాణలోని భద్రాచలం మెడికల్ కాలనీకి చెందిన పగిల్ల రాము (57), సావిత్రి (55) దంపతులకు దుర్గాప్రసాద్ (35) అనే కుమారుడు ఉండగా, ప్రతి రోజూ రోజూ మద్యం తాగి ఇంటికొచ్చి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన భార్య మౌనిక పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
ఆ తర్వాత కూడా అతను తీరు మారలేదు. పైగా, ఇంటిని కూడా విక్రయానికి పెట్టాడు. ఇందుకోసం తల్లిదండ్రులను హింసించ సాగారు. కొడుకు పెడుతున్న బాధలు చాలా రోజుల పాటు తట్టుకున్న వారిలో చివరకు సహనం నశించింది. కొడుకును అంత మొందించేందుకు భద్రాచలానికే చెందిన గుమ్మడి రాజు (33), షేక్ ఆలీ పాషా (32)లకు రూ.3 లక్షల సుపారీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారు.
 
ఈ కిరాయి హంతకులు వేసుకున్న ప్లాన్‌లో భాగంగా, ఈ నెల 9వ తేదీన అర్థరాత్రి పూట ఇంట్లో నిద్రిస్తున్న దుర్గాప్రసాద్‌ను సుపారీ వ్యక్తులు, తల్లిదండ్రులు కలిసి కత్తితో మెడ కోసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని తుమ్మలనగర్ అటవీ ప్రాంతానికి ఆటోలో తీసుకొచ్చి గానుగచెట్ల తోటలో పెట్రోలు పోసి తగులబెట్టారు. ఆ తర్వాత వారంతా ఊరు వదిలి వెళ్లిపోయారు. 
 
పదో తేదీ మధ్యాహ్నం అటవీ ప్రాంతానికి పుల్లల కోసం వెళ్లిన వ్యక్తికి కాలిపోయిన శవం కనిపించగా, స్థానికులతో కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ఎటపాక పోలీసులు ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో మృతదేహం ఫొటోతో కరపత్రాలు వేశారు. తెలంగాణలో ఉంటున్న మృతుని భార్య ఆ ఫొటో తన భర్తదేనని గుర్తుపట్టి పోలీసులను ఆశ్రయించండతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ మెట్రో పరువు పోయింది.. డోర్ వద్ద హగ్గులు, ముద్దులు