క్రికెట్ స్వస్థలం లండన్ లార్డ్స్ పేరు మారనుంది
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్రికెట్ క్రీడకు స్వస్థలమైన లండన్ లార్డ్స్ మైదానం పేరు త్వరలో మారనుంది. 900 మిలియన్ డాలర్లు వ్యయం కాగల అభివృద్ధి పథకంలో భాగంగా ఈ పేరును మార్చనున్నామని లార్డ్స్ క్రికెట్ మైదానానికి యజమాని అయిన మెరైల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసిసి) తెలిపింది.
ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ క్రికెట్ వేదికకు పెద్ద ఎత్తున మరమ్మతులు చేయాలని ఎంసిసి యోచిస్తోంది. ఇందులో భాగంగానే పేరు మార్పు జరుగుతుందని అయితే ఈ నామకరణం హక్కులను ఒక స్పాన్సర్కు విక్రయించే ఏర్పాట్లలో ఉన్నట్లు ఎంసిసి వర్గాలు వెల్లడించాయి.
స్పాన్సర్ షిప్ ప్యాకేజీలను ఇండియాకు విక్రయించవచ్చునని ఓ పత్రిక తెలిపింది. లార్డ్స్కు పేరును సూచించే హక్కుతో పాటు ఏడు స్టాండ్లలో ఒక్కొక్కదానికి నామకరణం హక్కులను అమ్మడం కూడా ఈ పథకంలో భాగం కావచ్చు.
ఈ పథకంలో భాగంగా స్టేడియంలో సీట్ల సంఖ్యను ఏడు వేలకు పైగా పెంచనున్నారు. అండర్ గ్రౌండ్ క్రికెట్ అకాడమీని ఇందులో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు ఆ పత్రిక తెలిపింది.