కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓ శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 10శాతం పెంచనున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అదనంగా 10శాతం కరువు భత్యం పొందవచ్చు. తాజాగా పెంచిన ఈ కరువు భత్యం (డియర్నెస్ అలవెన్స్) జులై 1 నుండి అమలులోకి రానున్నట్లు తెలిపింది.
పారిశ్రామిక కార్మికులకు చెందిన వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో కరువు భత్యాన్ని సమీక్షిస్తారు. తాజాగా పెరిగిన ఈ 10శాతం డీఏతో కలుపుకుని ఇది మొత్తం 167.9 పాయింట్లకు చేరుకుంది. ఈ సూచీ ఆధారంగా వేతనాలు పొందే ఉద్యోగులు జూలై నుంచి బేసిక్ శాలరీలో 45 శాతం కరువు భత్యంగా పొందుతారు.