సినిమాల్లో నటించనున్న సుధా మూర్తి
, గురువారం, 11 మార్చి 2010 (16:56 IST)
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా మూర్తి రచయితగా తన ప్రతిభను చాటుకున్నారు. అదే స్ఫూర్తితో ఆమె ఇకపై సినిమాలలోను నటించనున్నారు. దేశీయ ఐటీ రంగంలో అగ్రగామిగానున్న ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సంస్థ వ్యవస్థాపకుడు, ప్రధాన సంరక్షకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి శ్రీమతి సుధా మూర్తి కన్నడ సినిమా "ప్రార్థనే" (ప్రార్థన)లో నటించేందుకు సమ్మతించారు. ఈ చిత్రంలో అనంత నాగ్, పవిత్ర లోకేష్, ప్రకాష్ రాయ్ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ సినిమా పాత్రికేయులు సదాశివ్ షేనాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ సంస్కృతి, కన్నడ భాషను పరిరక్షించే విధంగా ఈ చిత్ర కథ ఉంటుంది. సుధా మూర్తి ఇదివరకు టీవీ సీరియల్లోను నటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో తాను రచనా రంగంలో మంచి పేరు తెచ్చుకున్నానని, ఇప్పుడు కొత్త రంగంలోకి ప్రవేశిస్తుండటంతో తనలో నూతన ఉత్సాహం పుట్టుకు వస్తోందన్నారు. తనకు సినిమాలు చూడటమన్నా, సంగీతం వినడమన్నా కూడా చాలా ఇష్టమన్నారు. ఈ వయసులో సినిమాలలో నటించాలనే ప్రత్యేకమైన కోరిక ఏదీ లేదని ఆమె తెలిపారు. తను నటించే సినిమాలో మేకప్ వేసుకోకుండా ఉండే పాత్రనే ఇవ్వమని తాను దర్శకుడి (షేనాయ్)ని కోరినట్లు ఆమె తెలిపారు. సుధా మూర్తి తమ చిత్రంలో నటిస్తున్నారని, ఆమెకు సంబంధించిన సీన్లు ఈ నెలలోనే షూటింగ్ పూర్తి చేసుకుంటామని దర్శకులు షేనాయ్ చెప్పారు.