మహిళలు రాజకీయంగా ఎదగాలి: సబితా ఇంద్రారెడ్డి
, శుక్రవారం, 26 మార్చి 2010 (15:44 IST)
రాష్ట్రంలో మహిళామణులు రాజకీయంగా ఎదగాలని రాష్ట్ర హోం శాఖామంత్రిణి సబితా ఇంద్రారెడ్డి అభిలషించారు. రాష్ట్రంలో ఇటీవల పొదుపు సంఘాల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న మహిళలు ఇకపై రాజకీయంగా ఎదగాలని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలంలో జరిగిన మహిళాసమాఖ్య వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె రుణాలు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ పొదుపు సంఘాల ద్వారా డబ్బును పొదుపు చేయడమే గాక బ్యాంకుల ద్వారా పావలా వడ్డీ రుణాలు పొంది సకాలంలో తిరిగి చెల్లిస్తున్నారన్నారు. ఇకపై మహిళలు రాజకీయాలలోను ఎదగాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు. ఇది మహిళలు గర్వించదగ్గ విషయమని, ప్రతి ఒక్కరు రుణాలు తీసుకున్నవెంటనే తిరిగి చెల్లించాలని ఆమె సూచించారు. ఒకప్పుడు నాలుగు గోడల మధ్య ఉండే మహిళలు పట్టుదలతో పొదుపు సంఘాల లావాదేవీలు నడుపుతూ లాభాలు ఆర్జించడం గర్వకారణమన్నారు. రంగారెడ్డి జిల్లాలో డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు ఇప్పటి వరకు ఎనమిది వందల కోట్ల రూపాయలు పొంది సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు. ప్రతి మహిళ లక్షాధికారి కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. అభయహస్తం ద్వారా ఐదువందల ఫించన్లు అందజేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. డ్వాక్రా మహిళలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగడమే గాక తమ పిల్లలందరిని ఉన్నత చదువులు చదివించాలని అందుకు ప్రభుత్వ సహకారం అందిస్తుందని ఆమె అన్నారు.