Publish Date: Fri, 25 Jul 2014 (18:16 IST)
Updated Date: Fri, 25 Jul 2014 (18:19 IST)
ఇంటిలోనే కాదు.. ఇంటి బయట కూడా తమ భర్తలకు సహకారం అందించాలనుకున్నారు నారీమణులు. ఆలోచన వచ్చిందే తడవుగా చకచకా ఓ సంస్థను ఏర్పాటు చేసేశారు. సంస్థ పేరు కమల సఖి. ఇదేదో బీజేపీకి అనుబంధ సంస్థలా వుందనుకుంటున్నారా! ఖచ్చితంగా అదేనండోయ్!
బీజేపీ ఎంపీల సతీమణులంతా కలిసి ఏర్పాటు చేసిన సంఘమిది. భర్తకు రాజకీయంగా చేదోడువాదోడుగా ఉంటూ వివాదాలకు దూరంగా నడిపించడం సభ్యుల లక్ష్యమట. అంతటితోనే ఆగరట.. స్వచ్ఛంద సేవ కూడా చేస్తామంటున్నారు. ఇందులో బీజేపీ మహిళా ఎంపీలు కూడా సభ్యులుగా వున్నారు. కొన్ని నిర్ధిష్టమైన విధివిధానాలతో కార్యాచరణ కూడా ప్రకటించారు.
ముఖ్యంగా తమతమ భర్తలకు రాజకీయంగా చేదోడువాదోడుగా ఉండి వివాదాలకు దూరంగా ఉండేలా నడిపించడం వీరి ప్రధాన కర్తవ్యం. ఇక మీడియాతో మాట్లాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్టింగ్ ఆపరేషన్ల బారిన పడకుండా తమ భర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకున్నారట కమలసఖి సభ్యులు.
ఈ సమావేశానికి 30 మందికి పైగా ఉన్న బీజేపీ మహిళా ఎంపీలు కూడా హాజరయ్యారు. ఇందులో అనేక అంశాలపై సభ్యుల నుంచి పలు కీలక సూచనలు వచ్చాయి. నియోజకవర్గాల్లో ప్రజలకు ముఖ్యంగా మహిళలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. మహిళా సంఘాలను ప్రోత్సహించి వారికి సర్కార్ నుంచి అవసరమైన సాయం అందేలా చూడాలనుకుంటున్నారు.
మొత్తానికి ఎంపీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భర్తకు అండగా ఉండాలన్న కమలసఖి సభ్యుల ఆలోచనను బీజేపీ నేతలు ఆహ్వానిస్తున్నారట. అభివృద్ధిలో మీరు కూడా భాగం కావాలంటూ మరింత ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. మరి కమలసఖి సంపూర్ణంగా వికసిస్తుందా? ఒకటి రెండు సమావేశాలకు పరిమితమవుతుందో చూడాలి.