ఆడవాళ్లు బహిష్టు సమయంలో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ,అధిక ఒత్తిడికి లోనవుతుంటారు.ఇలాంటి సందర్భాలలో నొప్పిని భరించలేక పెయిన్ కిల్లర్స్ను కూడా వాడుతుంటారు.ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు పెయిన్ కిల్లర్స్ వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే కొన్ని వంటింటి టిప్స్ ద్వారా బహిష్టు నొప్పిని నియంత్రించడం కుదురుతుందని నిపుణులు అంటున్నారు.
బహిష్టు సమయాల్లో వచ్చే నొప్పులు, తిమ్మిర్లపై అల్లం బాగా పనిచేస్తుంది. అల్లం వాడకం వల్ల ప్రిమెనుసు్ట్రవల్ సిండ్రోమ్ కారణంగా వచ్చే అలసట కూడా పోతుంది.కొంతమందికి బహిష్టులు సరిగా రాని వారికి ఇది మందులా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా బహిష్టులు వచ్చేలా అల్లం పనిచేస్తుంది. అందుకే ఈ టైములో చిన్న అల్లం ముక్కను తీసుకుని దాన్ని మెత్తగా చేసి నీళ్లల్లో వేసి, ఐదు నిమిషాల సేపు ఉడకనివ్వాలి. తర్వాత ఆ నీళ్లను వడగొట్టి అందులో కాస్తంత తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఈ టీ ని బహిష్టు సమయంలో రోజుకు మూడు సార్లు తాగితే బహిష్టు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
బహిష్టు సమయంలో వేడి టీ తాగడం వల్ల కండరాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.ఇలాంటి సమయాల్లో అల్లం, పిప్పర్మెంట్, లావెండర్, గ్రీన్ టీ, లెబన్గ్రాస్ వంటి హెర్బల్ టీలు తాగితే మంచిది. హెర్బల్ టీలు తాగడం వల్ల అలసట పోతుంది. నొప్పి కూడా తగ్గుతుంది.
బహిష్టు సమయంలో నీరు ఎంత తాగితే అంత మంచిది.కనీసం ఆరు నుంచి ఏడు గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి.అందుకే నెలసరి వచ్చే వారం రోజుల ముందు నుంచి ఆడవాళ్లు నీటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. నొప్పి, కండరాలు ఒత్తుకుపోవడం లాంటి బాధలు తలెత్తవు.
ఈ సమయంలో ముఖ్యంగా కాఫీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే, కాఫీ తాగడం వల్ల రక్తనాళాలు ముడుచుకుపోతాయి. దీని ప్రభావం గర్భాయం రక్తనాళాలపై పడే అవకాశం ఉంది. అక్కడి రక్తనాళాలు బిగుసుకుపోతాయి. కాఫీ తాగలేకుండా ఉండలేమనే ఆడవాళ్లు బహిష్టులు రావడానికి ఒక వారం ముందర నుంచి కాఫీ తాగడం మానేస్తే మంచిది. ఆ తర్వాత ఫలితం మీరే గమనించండి.
ఎక్కువ ఉప్పు ఉన్న ఫ్యాటీ ఫుడ్స్ కూడా ఈ టైములో తినకూడదు. అలా చేస్తే పీరియడ్స్ నొప్పి ఎక్కువయ్యే అవకాశం ఉంది. బహిష్టు సమయంలో అరటిపళ్లు తింటే మంచిది. వీటిల్లో పొటాషియం బాగా ఉంటుంది. అంతేకాదు ఈ పండు జీర్ణక్రియ సరిగా జరిగేట్టు చేస్తుంది. అరటిపళ్లే కాకుండా ఐరన్ ఎక్కువగా ఉండే కాయధాన్యాలు, పాలకూర, చిక్కుళ్లు వంటివి కూడా మీరు తీసుకునే డైట్లో ఉండేట్టు జాగ్రత్తలు తీసుకోవాలి.
దాల్చిన చెక్క యాంటి- క్లాటింగ్గా పనిచేస్తుంది.అందులో యాంటి-ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా పుష్కలంగా ఉన్నాయి. అందుకే బహిష్టు నొప్పుల నుంచి ఆడవాళ్లకు ఇది ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది.దాల్చినచెక్కలో పీచు పదార్థాలతో పాటు కాల్షియం, ఐరన్, మ్యాంగనీసులు రూడా ఉన్నాయి. దాల్చిన చెక్కతో చేసిన టీ బహిష్టు సమయంలో తాగితే ఎంతో మంచిది. వేడి నీళ్లల్లో పావు స్పూను దాల్చినచెక్క పొడి వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాలు తర్వాత అందులో కొద్దిగా తేనె వేసి కలిపి తాగితే ఎంతో రిలీఫ్ వస్తుంది. నెలసరి మొదలవడానికి రెండురోజుల ముందర నుంచి దాల్చిన చెక్క టీని రెండు లేదా మూడు కప్పులు తప్పనిసరిగా తాగాలి. ఇలా చేయడం వల్ల బహిష్టు బాధలు తలెత్తవు. అలాగే ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో అరచెంచా దాల్చిన చెక్క పొడి, ఒక టేబుల్ స్పూను తేనె వేసి బాగా కలిపి పీరియడ్స్ మొదటి రోజున మూడుసార్లు తాగితే బహిష్టు నొప్పులు తగ్గుతాయి.