వినాయకుని జన్మ వృత్తాంతం మీకు తెలుసా?
భాద్రపద మాసాన నాల్గవ రోజున వచ్చే గణేశచతుర్థి పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగానూ ఉల్లాసంగానూ జరుపుకుంటాం. వినాయక చతుర్థిని పురస్కరించుకుని ఆ పర్వదినానికి రెండు నెలల ముందే వేలాది సంఖ్యలో విఘ్నేశ్వరుని విగ్రహాల్ని విభిన్న ఆకృతుల్లో తయారుచేయడం ప్రారంభిస్తారు. దేశంలో ఈ పండగ సందడి ప్రధానంగా పూణె, ముంబై, ముంబై సమీపంలోని పెన్ అనే గ్రామంలో అత్యంత కోలాహలంగా జరుగుతుంది. గణనాధుడిగా ప్రపంచ ప్రజల పూజలందుకుంటోన్న శ్రీ మదఖిలాంద్రకోటి బ్రహ్మాండ నాయకుడైన వినాయకుడి జన్మ వృత్తాంతం ఏమిటో వినాయకచతుర్థి సందర్భంగా తెలుసుకుందామా..?పూర్వం గజముఖుడైన అసురుడు పరమేశ్వరుని మెప్పించి కోరరాని వరముకోరి, తను అజేయుడుగా, ఎవరూ వధించరాని విధంగా పరమేశ్వరుడిని తన ఉదరమందు నివశించాలని వరము పొందినాడు. అది విన్న పార్వతీదేవి కలతచెంది శ్రీ మహావిష్ణువును ప్రార్థంచగా.. నందీశ్వరుని గంగిరెద్దుగా, తాను (విష్ణువు) గంగిరెద్దువానిగా వేషము ధరించి గంగిరెద్దును ఆడించి గజాసురిని మెప్పించి, ఉదరమందున్న పరమశివుని కోరినాడు. ఇదంతా విష్ణుమాయ అని గ్రహించిన గజాసురుడు, తనకు చేటుకాలము దాపురించిందని తలచి, శివుని ఉద్దేశించి ప్రభూ! శ్రీహరి ప్రభావముచే నా జీవితము ముగియనున్నది. నా అనంతరం నా శిరస్సు త్రిలోకములు పూజించునట్లు, నా చర్మము నిరంతరము నీవు ధరించునట్లు వరము ఇవ్వమని, తన శరీరమును నందీశ్వరునికి వశము చేసి శివునకు ఉదరకుహరము నుండి విముక్తి కలిగించాడు.ఆ శుభవార్తను విన్న పార్వతి దేవీ అభ్యంగన స్నానమాచరించి భర్తను స్వాగతించాలని తలచి నలుగుపిండితో ఒక బాలుని బొమ్మను చేసి దానికి ప్రాణ ప్రతిష్ట చేసి స్నానవాకిట ముందు కాపలాగా ఉంచింది. ఇంతలోనే పరమశివుడు ఎంతో సంతోషముతో పార్వతి చెంత చేరాలని వస్తుండగా.. ఆ బాలుడు అభ్యంతరం తెలియజేస్తూ.. ముక్కంటిని నిలువరిస్తాడు. దీంతో ఆవేశమునకు లోనైన పరమేశ్వరుడు ఆ బాలునికి శిరచ్ఛేదము చేసినాడు. అది చూచిన మహేశ్వరి దుఃఖమును తీర్చుటకై తన వద్దనున్న ఆ గజశిరమును ఆ బాలునికి అతికించి ప్రాణ ప్రతిష్ట చేసి, ఆ గజాననునికి, తన రెండో కుమారుడైన కుమారస్వామికి మధ్య భూప్రదక్షిణ పోటీ పెట్టి త్రిలోకపూజితుడిగా గణాధిపత్యమును శివుడు ఆ బాలునికి కలిగించినాడని పురాణాలు చెబుతున్నాయి. ఇలా ముల్లోకములచే పూజలందుకుంటూ కైలాసము చేరుకునే వింతస్వరూపుడైన వినాయకుడిని చూసి... ఒకసారి చంద్రుడు విరగబడి నవ్వినాడు. దీంతో వినాయకుడు కోపించి ఓరి చవితి చంద్రుడా! ఈ రోజు నుండి నిన్ను చూసిన వారందరూ నీలాపనిందలు పాలవుదురు గాక! అని శపిస్తాడు. అంతలో చంద్రుడు తన తప్పిదాన్ని మన్నించమని పరిపరివిధాలా ప్రార్థించగా, "భాద్రపద శుద్ధ చవితి" నాడు నా జన్మ వృత్తాంతము విని, నిన్ను పూజింతి సేవించి నా కథాక్షతలు శిరస్సున ధరించిన వారికి నీలాపనిందలు కలుగవని శాపవిమోచనమును అనుగ్రహిస్తాడని పురోహితులు అంటున్నారు.తొలుత ఈ వినాయక చవితి వ్రత మహాత్మ్యమును పరమశివుడు కుమారస్వామికి తెలియజేశాడు. అనంతరం ఈ కథను నైమిశారణ్యమందు సూతమహర్షి శౌనకాది మునులకు చెప్పు సమయాన వనవాసము చేస్తున్న ధర్మరాజు కూడా విని ఈ వ్రతమాచరించి తిరిగి రాజ్యాని సంపాదించాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే దమయంతి ఈ వ్రతాన్ని ఆచరించి నలమహారాజును పొందెను. ఇంకా.. శ్రీ కృష్ణుడంతటివాడే పాలపాత్రయందు చవితి చంద్రుని చూచి నీలాపనిందలపాలై.. ఈ వ్రతాన్ని ఆచరించి, అటు శమంతకమణితో పాటు జాంబవతి, సత్యభామ అను ఇద్దరు కాంతామణులను పొందగలినాడని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుచేత వినాయకచతుర్థి నాడు విఘ్నేశ్వరుడిని నిష్ఠతో పూజించడం ద్వారా సమస్త సిరిసంపదలు, పుత్రపౌత్రాభివృద్ధి పొంది సమస్త కోరికలు తీరి సుఖ సౌభాగ్యములను పొందుతారని పురోహితులు అంటున్నారు.