Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గరికతో పూజించి.. గణపయ్య అనుగ్రహం పొందండి

Advertiesment
వినాయక చతుర్థి
WD
జ్యేష్టరాజుని కుమార్తెలైన సిద్ధి, బుద్ధిలను విఘ్నేశ్వరుడు వివాహం చేసుకోవడంతో వారికి క్షేముడు, లాభుడు అనే కుమారులు కలిగినారని పురోహితులు అంటున్నారు. అందుచేత విఘ్నేశ్వరుడిని వినాయక చతుర్థినాడు పూజించే భక్తులకు క్షేమం, లాభం కలుగుతుందని ప్రతీతి.

అందువల్ల వినాయక చవితి నాడు చేసే పూజలో ప్రధానమైంది 21 పత్రపూజ అని, వీటిలో గరిక (దూర్వాపత్రం)తో వినాయక స్వామిని పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. గణనాథుడికి ఎక్కువ ఇష్టమైన గరికను విఘ్నేశ్వర పూజలో జంట గరిక పోచలతో 21 సార్లు పూజించాలని పెద్దలంటున్నారు. అందుకోసం ఓ పురాణ గాథను కూడా చెబుతారు.

అదేంటంటే..? యమధర్మరాజు కుమారుడైన అనలాసురుడు.. అగ్ని సంబంధిత తేజస్సుతో పుట్టడం వల్ల అతని శరీరం నుంచి వచ్చే అగ్ని ఆవిరులు లోకాల్ని బాధిస్తుంటాయి. ఆ సమయంలో గణేశుడిని దేవేంద్రుడైన ఇంద్రుడు ప్రార్థించగా.. విఘ్నేశ్వరుడు అనలాసురుడిని నమిలి మింగేస్తాడు.

ఫలితంగా గణపయ్య బొజ్జలో అధిక ఉష్ణం జనించి, తాపం కలుగుతుంది. అమృతాలతో అభిషేకించినా ప్రయోజనం ఉండదు. అప్పుడు ముక్కంటి అయిన పరమేశ్వరుడు జంట గరికపోచలతో గణేశ్వరుడిని పూజచేయాలని సూచిస్తాడు.

పరమేశ్వరుని సలహాతో దేవతలు గణపతిని పూజిస్తారు. ఆ గరిక పూజతో గణపతి తాపం చల్లారిపోతుంది. అప్పటి నుంచి గణపతికి గరిక ప్రీతిపాత్రమైందని పురోహితులు చెబుతున్నారు. అందుచేత విఘ్నేశ్వరుడు జన్మించిన రోజున (వినాయక చతుర్థి) నాడు స్వామిని గరికతో పూజించి ఆయన అనుగ్రహం పొందుదాం..!

Share this Story:

Follow Webdunia telugu