Publish Date: Sat, 23 Jan 2021 (16:03 IST)
Updated Date: Mon, 25 Jan 2021 (13:37 IST)
బడ్జెట్ 2021 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా మధ్యతరగతి ప్రజలు ఆదాయపన్ను ఎంత తగ్గిస్తారోనని ఆశగా ఎదురుచూస్తుంటారు. ఇక చిన్నవ్యాపారులు తమ వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వం ప్రకటించే రాయితీలు ఏమిటా అని ఎదురుచూస్తుంటారు.
కానీ ఈసారి కరోనావైరస్ మహమ్మారితో కల్లోలమయిన దేశ ప్రజలకు ఊరటనిచ్చే దిశగా బడ్జెట్ వుంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కరోనా కారణంగా చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. పని చేస్తున్న ఈ కాలంలో వారు విద్యుత్, ఇంటర్నెట్, ల్యాప్ టాప్... ఇలా పనికి సంబంధించిన పరికరాల విషయంలో కాస్తంత సమస్యలు ఎదుర్కొంటున్నారు.
వీరికి ఊరటనిచ్చే దిశగా బడ్జెట్ ప్రతిపాదన వుంటుందని అంటున్నారు. బడ్జెట్లో కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం... ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు అవసరమైన వాటి విషయంలో ఊరటనిచ్చే దిశగా నిర్ణయాలు వుండవచ్చని చెపుతున్నారు. మరి ఆ సౌకర్యాలు ఏమేరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులను ఆదుకుంటాయో చూడాలి.