బాలీవుడ్ నటి శిల్పాశెట్టి విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం అనుమతినిచ్చింది. హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరెతో ముద్దువివాదంకు సంబంధించి బహిరంగ స్థలంలో అశ్లీలంగా ప్రవర్తించినందుకు ఆమెపై మూడు ఫిర్యాదులను ఆమె ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
దీంతో ఆమె విదేశాలకు వెళ్లకుండా చూడాలని దేశంలోని అన్ని విమానాశ్రయాలకు రాజస్థాన్లోని ముండవర్ ఎస్పీ నోటీసులు జారీ చేశారు. చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్, న్యాయమూర్తులు బీపీ సింగ్, జీపీ మాధుర్లతో కూడిన ధర్మాసనం ఆ ఎస్పీకి ఈ మేరకు శిల్పకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని నోటీసులు పంపింది.
శిల్పాశెట్టిపై ఇప్పటికే జైపూర్, ముండవర్, ఘజియాబాద్ కోర్టులలో పెండింగ్లో ఉన్న మూడు క్రిమినల్ కేసులపై సుప్రీం కోర్టు ఇదివరకే స్టే విధించింది. ఈ కేసులను ముంబయి కోర్టుకు బదిలీ చేయాలని శిల్ప దాఖలు చేసిన పిటిషన్ మేరకు సుప్రీం ఈ నిర్ణయం తీసుకుంది.