'విప్లవ నటుడు' మాదాల రంగారావు కన్నుమూత
విప్లవ నటుడు, నిర్మాత, 'రెడ్ స్టార్' మాదాల రంగారావు హైదరాబాద్లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో కన్నుమూశారు. ఈ నెల 19న ఆయన తీవ్ర అస్వస్థత, శ్వాసకోస సమస్యతో గురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ హాస్పటల్ల
Publish Date: Sun, 27 May 2018 (10:32 IST)
Updated Date: Sun, 27 May 2018 (10:34 IST)
విప్లవ నటుడు, నిర్మాత, 'రెడ్ స్టార్' మాదాల రంగారావు హైదరాబాద్లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో కన్నుమూశారు. ఈ నెల 19న ఆయన తీవ్ర అస్వస్థత, శ్వాసకోస సమస్యతో గురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ హాస్పటల్లో చేర్పించారు. అప్పటినుంచి అక్కడే చికిత్స పొందుతున్న మాదాల రంగరావు.. ఆదివారం ఉదయం 4:40 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని మరికొద్దిసేపట్లో ఫిలింనగర్లోని ఆయన కుమారుడి నివాసానికి తరలించనున్నారు.
మాదాల రంగారావు మృతి పట్ల ఆయన కుమారుడు, నటుడు మాదాల రవి మాట్లాడుతూ, 'నాన్నగారికి గత యేడాది గుండెపోటు రావడంతో ఆపరేషన్ చేయించాం. అప్పటినుంచి ఆయన డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంటున్నారు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హాస్పిటల్లో జాయిన్ చేశాం. అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్పై ఉన్నారు. ఈరోజు పరిస్థితి విషమించడంతో ఉదయం కన్నుమూశారు' అన్నారు.
మాదాల రంగారావు పేరు చెప్పగానే ఆయన నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన పలు విప్లవ చిత్రాలు గుర్తుకొస్తాయి. 'యువతరం కదిలింది'తో మొదలైన మాదాల రంగారావు విప్లవ చిత్రాల ప్రస్థానం.. ఎర్ర పావురాలు సినిమా వరకు సాగింది. ఒంగోలు జిల్లాలో ఓ సంపన్న కుటుంబంలో జన్మించారు మాదాల రంగారావు. కమ్యూనిస్టు భావాలతో మమేకమైన కుటుంబం నుంచి వచ్చిన మాదాల.. ప్రజానాట్య మండలితోనూ ఎంతో అనుబంధం కలిగి ఉన్నారు.