ఇటీవల ఢిల్లీలో పలువురు వీధి కుక్కల దాడులకు గురై చనిపోయిన ఘటనలు జరిగాయి. దీనితో ఢిల్లీ వీధుల్లో తిరిగే వీధి కుక్కలను షెల్టర్స్కి తరలించాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. వీధి కుక్కల కాటు వల్ల ఎందరో గాయపడటమే కాకుండా ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం, దేశ వ్యాప్తంగా గత ఏడాది సుమారు 37 లక్షల మంది కుక్క కాటుకు గురైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో మొత్తం 3 కోట్లకు పైగా వీధి కుక్కలున్నట్లు అంచనా. దీనితో వీధి కుక్కలు మనుషులపై స్త్వైర విహారం చేస్తున్నాయి. మరోవైపు జంతు ప్రేమికులు వీధికుక్కలకు సరిపడా షెల్టర్లు లేవని చెబుతున్నారు.
ఇదిలావుంటే సోషల్ మీడియాలో వీధికుక్కలపై Dogesh అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ ట్యాగ్ కింద రకరకాల వీడియోలతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది వీధికుక్కలను తరలించాల్సిందే, సరైన శిక్ష పడిందంటూ వ్యాఖ్యానిస్తుంటే, మరికొందరు వీధికుక్కలకు ఎంత కష్టం వచ్చింది అంటూ పోస్టులు పెడుతున్నారు. ఓ నెటిజన్ ట్రైన్ నుంచి కిందకి దిగుతున్న ఓ కుక్క వీడియో పోస్ట్ చేస్తూ... ఢిల్లీలో వుండొద్దన్నారు, అందుకే వచ్చేసా అంటూ కామెంట్ పెట్టాడు. ఇలా రకరకాల వీడియోలతో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.