బాబు మాటలు గుడ్డిగానమ్మి మోసపోయా : పవన్ కళ్యాణ్
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని గుడ్డిగా నమ్మి మోసపోయినట్టు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అలాగే, 2014 ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులను పోటీ చేయించకపోవడం తాను చ
Publish Date: Fri, 08 Jun 2018 (09:49 IST)
Updated Date: Fri, 08 Jun 2018 (09:50 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని గుడ్డిగా నమ్మి మోసపోయినట్టు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అలాగే, 2014 ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులను పోటీ చేయించకపోవడం తాను చేసిన అతిపెద్ద తప్పు అని చెప్పారు. జనసేన ఆధ్వర్యంలో సాగుతున్న ప్రజా పోరాట యాత్రలో భాగంగా ఆయన గురువారం విశాఖ జిల్లా పాడేరు, మాడుగుల, నర్సీపట్నంలలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు.
'2014 ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం 5-10 సీట్లయినా జనసేన గెలుచుకునేది. తద్వారా అసెంబ్లీలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని నిలదీసి ఉండేవాడిని. 2014లో అవినీతి పార్టీలను అడ్డుకోవడానికి కలిసి ప్రయాణం చేద్దామని చంద్రబాబు అంటే సరేనన్నాను. ఆయనను నమ్మి మోసపోయాను. పవన్ మారిపోయాడని ఆయన అంటున్నారు. ప్రత్యేక హోదాపై ఆయనే ఇప్పటికి 36సార్లు మాట మార్చారు. నేను విశాఖలో ప్రత్యేకహోదాపై ఆందోళన చేస్తానంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావంటూ అడ్డుకున్నారు. హైదరాబాద్లా అమరావతిలో మళ్లీ కేంద్రీకృత అభివృద్ధి కొనసాగిస్తున్నారు. ఆర్థిక భద్రత అంతా అమరావతి ప్రాంత నాయకుల వద్దనే ఉంటే మిగతావారంతా అడుక్కుతింటారా' అని నిలదీశారు.
'రాజధాని అమరావతి ఓ ఏనుగు. ఏనుగును ఎవరైనా పెంచుకోగలరా.. దానిని మేపడం ఎంత కష్టం'. '18 జీవనదులు ఉన్న ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువ శాతం పొట్ట చేతబట్టుకుని వలస పోతున్నారు. ఈ ప్రాంతంలోని యువత ఉపాధి లేక గంజాయి రవాణా వంటి చెడుమార్గంలో ప్రయాణిస్తున్నారు. ఎంపీ అశోక్గజపతిరాజు కూడా ఈ సమస్యలను సీరియ్సగా తీసుకోవడం లేదు' అని విమర్శల వర్షం కురిపించారు.
'నేను ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నానని, కులాలను నమ్ముకుంటున్నానని ముఖ్యమంత్రి అంటున్నారు. ఆ మాట అనడానికి ఆయనకు సిగ్గుండాలి. టీడీపీలో ప్రతి నాయకుడి బండారం, దోపిడీ గురించి నాకు తెలుసు. నాతో డొంకతిరుగుడు వ్యవహారాలు పెట్టుకోవద్దు' అని ఘాటుగా హెచ్చరించారు. చంద్రబాబులా ఎవరో రాసిన ప్రసంగాలు తాను చదవడం లేదని.. మనసు లోతుల్లోంచి వచ్చిన భావాలే తన మాటలన్నారు. మీరు గద్దె ఎక్కి నన్ను తొక్కుతున్నారు. ధృతరాష్ట్రుడిలా కళ్లు మూసుకొని మాట్లాడొద్దు. వయసుకు తగ్గ మాటలు కావవి' అని ధ్వజమెత్తారు.