Publish Date: Sun, 07 Aug 2022 (12:54 IST)
Updated Date: Sun, 07 Aug 2022 (12:45 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఆదివారం ఉదయం 9.18 గంటలకు ఎస్ఎస్ఎల్వీడీ1 రాకెట్ను నింగిలోకి పంపించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ సెంటరు నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్ళిన ఎస్ఎస్ఎల్వీ-డి1 రాకెట్ ప్రారంభ ప్రయోగం విజయవంతమైంది. మూడో దశలో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే, సాంకేతిక సమస్యలతో ఉపగ్రహాల నుంచి షార్ సెంటరుకు సంకేతాలు అందకపోవడంతో ఈ రాకెట్ ప్రయోగంపై సందిగ్ధత నెలకొంది. అతి తక్కువ ఖర్చుతో ఈ ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.
ఈ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ, ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ ప్రయోగం తొలి మూడు దశలు సక్రమంగానే జరిగిందన్నారు. కానీ, తుది దశలో సమాచార సేకరణలో కొంత ఆలస్యమైందని తెలిపారు. ప్రయోగ పురోగతిపై వీలైనంత త్వరగా సమాచారం. అందిస్తామని ప్రకటించారు. ముఖ్యంగా, ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశించాయా లేదా అనే అంశాన్ని విశ్లేషిస్తున్నట్టు సోమనాథ్ వెల్లడించారు.