Publish Date: Fri, 31 May 2024 (22:36 IST)
Updated Date: Fri, 31 May 2024 (22:39 IST)
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఒక సైనికుడు గుండెపోటుతో మరణించాడు. వేదికపై సైనికులు నృత్య ప్రదర్శనలు చేశారు. త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని 'మా తుజే సలామ్' అనే దేశభక్తి గీతానికి డ్యాన్స్ చేశారు. అక్కడ ఉన్నవారంతా చప్పట్లు కొట్టారు. అలా జాతీయ పతాకాన్ని చేతితో పట్టుకుని స్టేజిపై వున్న రిటైర్డ్ సైనికుడు అకస్మాత్తుగా కింద పడిపోయాడు.
ఈ విషాదకర ఘటన ఇండోర్లోని ఫూటీ కోఠిలోని అగ్రసేన్లో ఉన్న యోగా సెంటర్లో జరిగింది. మే 31 శుక్రవారం, 67 ఏళ్ల రిటైర్డ్ సైనికుడు బల్వీందర్ సింగ్ ఛబ్రా ఇక్కడ ఉచిత యోగా శిబిరానికి చేరుకున్నారు. బల్వీందర్ సింగ్ ఛబ్రా వేదికపై దేశభక్తి గీతం 'మా తుజే సలామ్'పై నృత్యం చేస్తున్నాడు. ఆయన చేతిలో త్రివర్ణ పతాకం ఉంది. దానితో అతను డ్యాన్స్ చేశాడు. అతడి నృత్య ప్రదర్శనకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వీక్షించారు. చప్పట్లు కొట్టారు. అలా జరుగుతుండగానే అతడు ఒక్కసారిగా తడబడి కింద పడిపోయాడు. ఎంతసేపటికి అతను పైకి లేవలేదు. ప్రేక్షకులు ఇది ప్రదర్శనలో భాగమని భావించి చప్పట్లు కొడుతూనే ఉన్నారు.
ఇంతలో మరో వ్యక్తి త్రివర్ణ పతాకాన్ని చేతుల్లోకి తీసుకుని రెపరెపలాడించడం ప్రారంభించాడు. పాట ముగిసిన తర్వాత కూడా బల్వీందర్ సింగ్ లేవకపోవడంతో, అతన్ని లేపడానికి ప్రయత్నించారు. కానీ అతను లేవలేదు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించగా, బల్వీందర్ సింగ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.