Publish Date: Tue, 27 Jul 2021 (11:33 IST)
Updated Date: Tue, 27 Jul 2021 (11:37 IST)
కర్నాటక సీఎం యడ్యూరప్ప రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన ఇపుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ కి గవర్నర్ గా రానున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కర్నాటకలో సీఎంగా రాజీనామా సమర్పించిన యడ్యూరప్ప రాజీనామాను అక్కడి గవర్నర్ తాహెర్ చాంద్ గెల్హాట్ ఆమోదించారు.
రెండేళ్లపాటు కర్నాటక సీఎంగా కొనసాగిన యడ్యూరప్ప, తాను సీఎంగా రాజీనామా చేసినా కర్ణాటక రాజకీయాల్లో కొనసాగుతానని ఇప్పటికే ప్రకటించారు కూడా. కానీ, బీజేపీ కేంద్ర నాయకత్వం ఆయనను రాజకీయ క్షేత్రం నుంచి బయటకు పంపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అంటే, కర్ణాటకలోని బీజేపీ రాజకీయాలకు దూరంగా ఆయన్ని పంపాలని ఢిల్లీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కర్నాటక రాజకీయాల్లో యడ్యూరప్ప మార్కు ఎంత బలమైనదో బీజేపీ వర్గాలు తెలుసు. ఆయనతో కర్ణాటక సీఎంగా రాజీనామా చేయించడమే ఒక పెద్ద మైలురాయిగా చెపుతున్నారు.
ఇపుడు ఆయనను కర్ణాటక నుంచి తప్పించడం అంటే సామాన్య విషయం కాదంటున్నారు. అయితే, ఆయన్ని రాజకీయాల నుంచి తప్పించినట్లుండాలి...మరోపక్క ఆయన గౌరవానికి భంగం కలగకూడదు...అందుకే మధ్యేమార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ రాజకీయ కోణంలో జరిగే కొత్త పరిణామాల్లోనే యడ్యూరప్పకు స్థాన చలనం కలగబోతోంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ గా యడ్యూరప్ప రానున్నరాట్లు సమాచారం.