కాలినడకన తిరుమలకు పవన్.. మదర్స్ డే విశిష్టత గురించి పవర్ స్టార్ ఏమన్నారంటే..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాలినడకన తిరుమల కొండలెక్కి శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం రాత్రి నడక ప్రారంభించిన పవన్.. మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ.. దారి వెంబడి అందరినీ పలకరించుకుంటూ ముందుకుసాగారు
Publish Date: Sun, 13 May 2018 (16:43 IST)
Updated Date: Sun, 13 May 2018 (16:49 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాలినడకన తిరుమల కొండలెక్కి శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం రాత్రి నడక ప్రారంభించిన పవన్.. మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ.. దారి వెంబడి అందరినీ పలకరించుకుంటూ ముందుకుసాగారు.
అక్కడ సంచరిస్తోన్న కుక్కపిల్లకు బిస్కెట్లు తినిపిస్తూ సందడిచేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన పవన్కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఆపై శ్రీవారి దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. మే 15 నుంచి గ్రామ స్వరాజ్య యాత్ర చేపట్టనున్న పవన్ కల్యాణ్.. ఈ మూడు రోజులూ తిరుపతిలోనే ఉండనున్నట్లు సమాచారం.
మరోవైపు మదర్స్ డే విశిష్టత గురించి పవన్ స్పందించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాతృమూర్తులకు వందనం అంటూ.. ఇదో పండుగ కాదని బాధ్యత అంటూ ట్వీట్ చేశారు. మదర్స్ డే అంటే అమ్మను తలచుకోవడం మాత్రమే కాదని.. అమ్మ మనకు ప్రసాదించిన జీవితాన్ని తలచుకోవడం అన్నారు.
ఈ జీవితాన్ని మనకు ప్రసాదించడంలో అమ్మ చేసిన త్యాగాన్ని గుర్తించుకోవాలన్నారు. అమ్మను మనం జీవించి వున్న ప్రతిరోజూ కృతజ్ఞతలు తెలియజేసుకోవడం ఓ బాధ్యత అంటూ పవన్ గుర్తు చేశారు. మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులందరికీ శుభాభివందనాలు తెలిపారు.