Publish Date: Sat, 20 Nov 2021 (12:48 IST)
Updated Date: Sat, 20 Nov 2021 (12:51 IST)
రాజకీయాలు పార్టీలపైన చేసుకోవాలి కానీ వ్యక్తులపైన కాదనీ, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను నోటికొచ్చినట్లు విమర్శిస్తే ఇకపై చూస్తూ కూర్చోబోమని నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు.
తన స్వగృహంలో కుటుంబ సభ్యుల మధ్య కూర్చుని మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు ముందుచూపు వున్న వ్యక్తి, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపారు. అలాంటి వ్యక్తి పట్ల మీ ప్రవర్తన ఇలాగా వుండేది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తున్నారు.
పార్టీ ఆఫీసులపై దాడులు చేస్తున్నారు. కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. ఆఖరికి మా నాయకుడిని అనరాని మాటలు అంటున్నారు. అసెంబ్లీలో మాటకు మాట వుంటుంది. కానీ అది సమస్యలపై కానీ వ్యక్తిగతంగా వుండకూడదు. ఏ సంబంధం లేని ఆడవాళ్లను కించపరిచేట్లు ఇకపై మాట్లాడితే ఖబడ్దార్, మీ భరతం పడతాం.
మీ నోళ్లు మూయించడానికి మాకు చంద్రబాబు అనుమతి అవసరంలేదు. గతంలో మీరు అనుచితంగా ప్రవర్తించినప్పటికీ మమ్మల్ని ఆపేవారు చంద్రబాబు. ఇక ఆ పరిస్థితి లేదు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే మాత్రం సహించేది లేదు. మేమంతా కూడబలుక్కున్నాం. మా కుటుంబం నుంచి అయితేనేమి, మా కార్యకర్తల వైపు నుంచి అయితేనేమి, నా అభిమానుల నుంచి అయితేనేమి... ఏమాత్రం తేడా మాట్లాడినా మిమ్మిల్ని నిలదీస్తాం" అంటూ హెచ్చరించారు బాలకృష్ణ.