Publish Date: Mon, 07 Jan 2019 (16:03 IST)
Updated Date: Mon, 07 Jan 2019 (16:19 IST)
వచ్చే నెలలో లోక్సభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదేశంలో ఆర్థికంగా వెనుకబడిన బలహీనవర్గాల వారికి విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు.
ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయనున్నారు. దీనికి సంబంధించిన బిల్లును మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో అమలవుతున్న 50 శాతం రిజర్వేషన్లతో పాటు.. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు.
అయితే, ఈ బిల్లుకు లోక్సభలో అడ్డంకి లేకపోవచ్చుగానీ రాజ్యసభలో మాత్రం ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అదేసమయంలో పది శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ప్రధాని మోడీ చేసిన ప్రకటనకు ఇపుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ రిజర్వేషన్లు వర్తించాలంటే వార్షిక ఆదాయం రూ.8 లక్షలుగా ఉండాలి. వ్యవసాయ భూమి 5 హెక్టార్ల కంటే తక్కువగా ఉండాల. నివసించే ఇల్లు వెయ్యి చదరపుటడుగుల కంటే తక్కువగా ఉండాలి, మున్సిపాలిటీయేతర ప్రాంతంలో అయితే నివాస భూమి 209 చదరపు గజాల కంటే తక్కువగా ఉండాలన్న షరతులు విధించింది. ఈ రిజర్వేషన్లు కులంతో నిమిత్తం లేకుండా ఆర్థికంగా వెనుకబడిన బీసీలందరికీ వర్తించనున్నాయి.