తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన సోమవారం ఏడుకొండల స్వామి సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించాడు. రాక్షసుల మదిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సింహంలా దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం.
దుష్ట జన శిక్షణ, శిష్ట జన రక్షణకు ఇది సంకేతం. దశావతారాల్లో నాలుగోది అయిన నృసింహ అవతారం కాగా, బ్రహ్మోత్సవాల్లో నాలుగు వాహనం కూడా సింహమే కావడం గమనార్హం.
సింహవాహనంపై శ్రీనివాసుడి ఊరేగింపు సందర్భంగా వీధులు భక్తులతో కిటకిటలాడాయి. సింహవాహనంపై శ్రీవారు ఉరేగిన సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి.
స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద యెత్తున తిరుమలకు తరలి వచ్చారు. లక్ష మంది భక్తులు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.
ఇకపోతే జంతువులకు రాజైన సింహాన్ని సైతం తానేనంటూ మనుషులలో జంతుస్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. యోగశాస్త్రంలో సింహాన్ని వాహన శక్తికి, గమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. శ్రీవేంకటేశ్వరుడు తనలోని పరాక్రమాన్ని ప్రపంచానికి చాటడానికి ఈ వాహనంపై వేంచేస్తారని ఆర్యోక్తి.