బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గరుడ సేవకు తిరుమల తిరుపతి దేవస్థానం రంగం సిద్ధం చేసింది. జనప్రవాహానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూసేందుకు పోలీసుల తమ నిఘా విభాగాన్ని అప్రమత్తం చేశారు. సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. విఐపిలను నియంత్రించేందుకు తితిదే నిర్ణయం తీసుకుంది.
తిరుమలలో ఏదైనా పెద్ద పండుగ ఉందంటే అది గరుడ సేవేనని చ్పెపాలి. గరుడ వాహనంపై ఊరేగడమంటే వెంకన్నకు అంతటి ఇష్టం. గరుడ వాహనంపై శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు క్యూ కడతారు. దాదాపుగా 4 లక్షల మంది భక్కులతో ఆ రోజు తిరుమల కొండలు మార్మోగుతాయంటే అతిశయోక్తి కాదు. భక్తుల తాకిడిని తట్టుకోవడానికి ఇప్పటికే తితిదే సర్వసన్నద్ధమైంది. తిరుమాడ వీధులలో బారికేడ్లను ఏర్పాటు చేసింది.
తిరుచానూరు అమ్మవారి చక్రస్నానమన్నా, తిరుమలలో గరుడ సేవన్నా స్థానికులు అక్కడ వాలిపోతారు. సంప్రదాయబద్ధంగా శ్రీవారిని దర్శించుకుని వెనుదిరుగుతారు. ఏడాదంతా ఎక్కడున్నా ఈ ఒక్కరోజు మాత్రం తిరుమల బాట పడతారు. ఇది ఇక్కడి ఆనవాయితీ. ఈ తాకిడిని నియంత్రించడానికి తితిదే ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తుంది. తిరుమలలో ఒక్క గరుడసేవ రోజున ద్విచక్రవాహనాలను అనుతించరు. ఇది గరుడ సేవ రోజున ఉదయం నుంచే అమలవుతాయి. అన్నింటిని తిరుమల టోల్గేట్ వద్దే నిలిపివేస్తారు.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు కూడా అధికంగా ఉంటారు. గరుడసేవ రోజున స్వామిని దర్శించుకుంటే మేలు జరుగుతుందనే నమ్మకం చాలా మందిలో ఉంది. ఇందుకు తగ్గట్టుగానే క్యూ కాంప్లెక్స్లు కిక్కిరిసి పోతాయి. వాటిలో వేచి ఉన్న భక్తులకు అన్నపానీయాలు అందించడానికి అప్పుడే టిటిడి రంగం సిద్ధం చేసింది. మజ్జిగ, పాలు, పులిహోర వంటి పదార్థాల తయారీకి సన్నాహాలు చేస్తున్నారు. క్యూ కాంప్లెక్సులతోపాట బయటి భక్తులను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తన్నారు.
ఇక విఐపిల తాకిడితో మొదట నుంచి సామాన్య భక్తులకు అన్యాయం జరుగుతోంది. అయితే ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే వారికి మినహా మరెవ్వరికి పాసుల ఇవ్వరాదని తితిదే తీర్మానించింది. తితిదే ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు, పోలీసుల కుటుంబాల కోసం పరిమితంగా పాసులు సిద్ధం చేశారు. ఈ మేరకు వారికోసం గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వారు ఆయా గ్యాలరీలలోంచి గరుడ సేవను తిలకించాల్సి ఉంటుంది. రాజకీయ నాయకుల తాకిడి నిలువరించేందుకు నిర్ణయం జరిగిందని చెబుతున్నా ఇది అమలులో ఏ మాత్రం సాధ్యమవుతుందనేది అనుమానమే.
ఇవన్నీ ఇలా ఉండగా పోలీసులు తిరుమల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. గరుడ సేవ రోజు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని సిసి కెమెరాల సంఖ్యను పెంచారు. వీటన్నింటిని కంట్రోల్ రూంకు అనుసంధానించి నిశితంగా గమనిస్తారు. వెంటనే సమీపంలోని పోలీసు బృందాలు రంగంలోకి దిగుతాయి. మొత్తంపై తితిదే యంత్రాంగానికి గరుడ సేవ రోజున వెంకన్న పరీక్ష పెడతారు. ఆయన మాత్రం చిద్విలాసంగా గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులను ఆనంద పారవశ్యులను చేస్తారు.