మనకు తెలిసిన పండగ అంటే ఉగాది, సంక్రాంతి, దీపావళి, వైకుంఠ ఏకాదశి, శివరాత్రి, దసరా.. మహా అంటే వరలక్ష్మి వ్రతం, శ్రీ కృష్ణాష్టమి.. ఇంకా చెప్పుకుంటూ పోతే జాతరలు, తిరుణాళ్ళు అంతేనా ఇంకా ఏమైనా ఉన్నాయా. ఇవన్నీ వేళ్ళ మీద ఇట్టే లెక్కెట్టవచ్చు. కానీ ఏడాదికి జరిగే పండుగలు, పర్వదినాల సంఖ్య ఎంతో తెలుసా.. 433.
ఉన్న 365 రోజులలో 433 పండగలు. ఇది నిజం కొన్ని శతాబ్దాలుగా జరుగుతున్న నిజం. చరిత్ర చెబుతున్న వాస్తవం. ఇవన్నీ మరి ఎక్కడో కాదు. ఏడుకొండల క్షేత్రం తిరుమలలో వేంకటేశ్వర స్వామి ఎదుట జరుగుతున్న పండగలు ఇవి. ఇందుకు సంబంధించి 1380 సంవత్సరం నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న గ్రంధాలు, రికార్డులు చెబుతున్న నిజం. మహత్తరంగా ఉంది కదూ...
తిరుమలలో జరిగే పండగలు, పర్వదినాలను రెండు రకాలుగా విభజించారు. అవి తింగల్, విశేష దివస్లు(పండుగలు). ఇందులో ప్రతీ నెలలో శుక్ల పక్షం, కృష్ణ పక్షం సందర్భంగా కనిపించే పవిత్ర నక్షత్రాలను అనుసరించి తింగల్ దివస్లు నిర్వహిస్తారు. ఇక విష్ణు దివస్లు. ఇవి ప్రత్యేకమైనవి. పవిత్రమైన దశమ భాగాలు లేదా నక్షత్రాలను అనుసరించి వచ్చే ఆళ్వార్లు, ఆచార్యులు పుట్టిన రోజులు, స్వామి అవతారాలను ఆధారంగా చేసుకుని పండుగలను నిర్వహిస్తారు. తింగల్, విశేష దివస్ ల ప్రస్తావన 1488, 1562, 1819 సంవత్సరాలలో లిఖించిన పుస్తకాలలో స్పష్టంగా చెప్పారు.
దీనిని అనుసరించి అంతకుముందు కొన్ని వందల యేళ్ళుగా ఈ సంప్రదాయం వస్తూనే ఉంది. దీనిని అనుసరించి 433 పర్వదినాలలో బ్రహ్మోత్సవాలతో కలుపుకుని 204 విశేష రోజులు కాగా, 217 రోజులు తింగల్ దివస్ల కింద పండగలు నిర్వహిస్తారని 1562 నాటి గ్రంథాలలో లిఖించబడి ఉంది. అప్పటికి 431 రోజుల పండగలు అయితే ఇవి కాకుండా నక్షత్రోత్సవం, పూర్ణిమలతో కలుపుకుని ఏడాదిలో 433 పండుగలు తిరుమలలో నిర్వహిస్తారని ఇందులో రాసి ఉన్నారు. దీపావళి, శ్రీరామనవమి, శ్రీకృష్ణ జయంతి వంటి పండుగలను విశేష దివస్లలో కలిపారు. వీటిలో చాలా పండుగలు నేటికీ జరుగుతూనే ఉన్నాయి. అందుకేనేమో పెద్దలు తిరుమలలో నిత్య కళ్యాణం-పచ్చతోరణం ఉంటుందన్న నానుడి ప్రచారంలోకి వచ్చినట్లుంది. మొత్తంపై తిరుమల క్షేత్రం నిత్యం పర్వదినాలమయమే.