తిరుమలలో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి మహోత్సవాల్లో మూడో రోజైన సోమవారం రాత్రి మలయప్ప స్వామి ముత్యపు పందిరిపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు.
దేవేరులతో దివ్యసుందరంగా అలంకృతమైన స్వామివారు ముత్యపు పందిరిపై ఆసీనుడై తిరుమాడవీధుల్లో ఊరేగిన వైనం భక్తులకు కనువిందు చేసింది. స్వచ్ఛమైన పరిశుద్ధతకు ప్రతీక ముత్యాలు. ముత్యాల పందిరి వాహనంలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన దేవదేవున్ని వీక్షించిన భక్తజనం తన్మయత్వం చెందారు.
ముక్తి సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని ఈ వాహనం ద్వారా స్వామివారు లోకానికి చాటి చెబుతారు. మూడవరోజు సోమవారం రాత్రి శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోరంజకంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేశారు.