తిరుమలలోని శేషగిరి కొండలు అను నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగుతుంటాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి సంరక్షణలో తాము ఉన్నామనే మహత్తర భావనను ప్రతి భక్తుడికీ ఈ గోవింద నామస్మరణ గుర్తు చేస్తూ ఉంటుంది. శ్రీవారి సన్నిధికి వచ్చే లక్షలాది భక్తులు గోవింద నామస్మరణలో మునిగి తేలుతుంటారు. దైవ దర్శనం కోసం గంటల కొద్దీ సమయం వేచి ఉండవలసిన భక్తులకు ఈ గోవింద నామస్మరణం తగు శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. పైగా తిరుపతి నుంచి 9 కిలోమీటర్లు దూరంలో ఉండే ఆలయానికి 3661 మెట్లు ఎక్కి వచ్చే భక్తులకు ఈ గోవింద నామస్మరణమే శక్తిని, దృఢత్వాన్ని ఇచ్చి స్సూర్తి కలిగిస్తూంటుంది.
దక్షిణాదిన పెరుమాళ్గా, పశ్చిమాన శ్రీనివాసుడిగా, ఉత్తరాదిన బాలాజీగా శ్రీవారిని భక్తులు పిలుస్తుంటారు. అయితే ప్రాంతాలు వేరైనా భక్తులందరికీ సమస్యలు తీర్చి కష్టాలు కడతేర్చే రక్షకుడిగా శ్రీవారు వెలుగొందుతుంటారు. పెరుమాళ్ లేదా శ్రీవేంకటేశ్వరుడు లేదా మలయప్ప స్వామిగా ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారిని పలు పేర్లతో సేవించే భక్తులకు తిరుమల భూతల స్వర్గంగా ఉంటుంది. కాగా, దేశంలోని భక్తులు తిరుమల గిరిని సాక్షాత్తూ స్వర్గసీమగా భావిస్తుంటారు.
శ్రీవారిని దర్శించుకుని ఆయన ఆశీర్వాదాలను అందుకుందామని వచ్చే లక్షలాది భక్తులను పచ్చటి అడవుల మధ్య పాములాగా మెలికలు తిరిగే రహదారులు విపరీతంగా ఆకట్టుకుంటాయి. శ్రీవారిని దర్శించుకుంటే చాలు జన్మ ధన్యమయినట్లేనని చాలామంది భక్తులు భావిస్తుంటారు. కేవలం స్వామివారి దర్శన భాగ్యం కోసమే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల భక్తులు లెక్కకుమించి తిరుమల సందర్శిస్తుంటారు. వీరు గదుల కోసం కాని, ప్రసాదం కోసం కాని ఆశించరని, తమ ఇలవేల్పు దర్శనమాత్ర భాగ్యం కోసమే వీరు పరితపించిపోతూ ఉంటారని తిరుమల ఆలయ ప్రధాన పూజారి రమణ దీక్షితులు తెలిపారు.
దేశంలోనే అతిపెద్ద యాత్రా కేంద్రం తిరుమల...
తిరుమల నేడు భారత దేశంలో అతి పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తున్న యాత్రా కేంద్రంగా మారింది. దేశంలోని భక్తుల పర్యాటక మ్యాప్లో శాశ్వతమైన, కీలకమైన కేంద్రంగా తిరుమల రూపొందింది. హిందూ మతంలోని వైఖానస పూజా విధానంలోని ఆగమ సాంప్రదాయాలను తుచ తప్పకుండా ఆచరించడం ద్వారా శ్రీవేంకటేశ్వరుడి దివ్య శక్తి తరతరాలుగా తిరుమలలో వెలుగొందుతోంది. స్వామివారి ఈ దివ్యశక్తే తిరుమలకు ప్రజాదరణను కల్పించి, లక్షలాది జన సమూహాలను శ్రీవారి ఆలయానికి రప్పిస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో అంకితభావం కలిగిన అర్చక బృందం, పరమ భక్తిపరులైన అధికారులు మరియు దాని టిటిడి ధర్మకర్తలు కలిసి తిరుపతిని దేశంలోనే పేరెన్నిక గన్న యాత్రా స్థలంగా మార్చడానికి ఆహర్నిశలూ శ్రమిస్తుంటారు. 'ఈ లక్ష్యం కష్టసాధ్యమైందే కావచ్చు కానీ శ్రీవేంకటేశ్వరుడి కరుణా కటాక్ష వీక్షణాల ప్రభావ ఫలితంగా తిరుమలకు వచ్చిన భక్తులు ఆకలి దప్పులతోనూ, దర్శనం కాకుండా తిరిగి వెళ్లర'ని టిటిడి ఛైర్మన్, చిత్తూరు ఎంపీ అయిన డి.కె ఆదికేశవులు చెప్పారు.