నాలుగు దశాబ్దాలను పూర్తిచేసుకుని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచిన నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్. ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఈ నిర్మాణ సంస్థలో శర్వానంద్, నిత్యామీనన్ జంటగా ప్రస్తుతం రూపొందుతోన్న చిత్రం 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'.
క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.యస్.రామారావు సమర్పణలో సి.సి.మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ బ్యానర్పై క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న ప్రేమకథాచిత్రం 'మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు'. ఇటీవల ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికేట్ను పొందింది. సినిమాని ఫిబ్రవరి 6న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా.... చిత్ర సమర్పకులు కె.యస్.రామారావు మాట్లాడుతూ '''మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు' అనే మంచి పాటలోని పదాలను తీసుకొని అంతే మంచి సినిమా తీద్దామనే కోరికతో అదే టైటిల్ పెట్టాం. డైరెక్టర్ క్రాంతిమాధవ్ ఈ కథ చెప్పినపుడు చాలా కాలం తర్వాత చాలా గొప్ప ప్రేమకథ అనిపించింది. ప్రతి వారం నాలుగైదు సినిమాలు ప్రేమకథలతోనే వస్తున్నాయి. కానీ, ఇది నిజంగా నిజమైన ప్రేమకథ.
చాలా చక్కని పవిత్రతతో కూడిన ప్రేమకథ. ఎంతో ఎమోషనల్గానూ, అంతకంటే అందంగానూ వుండే ప్రేమకథ. ఒక పుష్పగుచ్చాన్ని చూస్తే కలిగే ఫీలింగ్ ఈ సినిమా చూస్తే కలుగుతుంది. ఈ ప్రేమకథకు పర్ఫెక్ట్ కాస్టింగ్ కుదిరారు, వెర్సటైల్ ఆరిస్ట్స్ శర్వానంద్, నిత్యమీనన్ పోటీపడి మరీ నటించారు. వీరి మధ్య నడిచే ప్రేమకథను చాలా నేచురల్గా, అందరూ మెచ్చేవిధంగా తీశాడు క్రాంతిమాధవ్.
కథను ఎలా నెరేట్ చేశాడో అంత కంటే బ్యూటిఫుల్గా డైరెక్ట్ చేశాడు. ఆ విషయాన్ని సినిమా చూసే ప్రేక్షకుడు ఆ ఫీల్ను పొందుతాడు. గోపిసుందర్ ఈ చిత్రానికి చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటికే ఆడియో పెద్ద హిట్టయింది. ఈ సినిమాకి పనిచేసిన మిగతా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే సాహితిగారు, రామజోగయ్యశాస్త్రిగారు పాటలు చాలా బాగా రాశారు. అలాగే సాయిమాధవ్ చాలా నేచురల్గా డైలాగ్స్ రాశారు.
నిజంగా ప్రేమికులు ఎలా మాట్లాడుకుంటారు అనేది చాలా క్రిస్ప్గా రాశారు. మా కెమెరామెన్ జ్ఞానశేఖర్ సినిమాని చాలా అందంగా చూపించాడు. కాంతి మాధవ్ తను అనుకున్న కథలో ఏదైతే ఫీల్ అయ్యాడో, ఆ ఫీల్ని స్క్రీన్ మీదకు తీసుకు రావడంలో జ్ఞానశేఖర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. వాళ్లిద్దరూ కలసి ఒక సెల్యులాయిడ్ లవ్ పోయెమ్లా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికేట్ పొందింది. సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 6న విడుదల చేస్తున్నాం'' అన్నారు.
చిత్ర నిర్మాత కె.ఎ.వల్లభ మాట్లాడుతూ ''మళ్లీ మళ్లీ ఇది రాని రోజు ఒక బ్యూటిఫుల్ పొయెటిక్ లవ్స్టోరి. ప్రతి ప్రేమికులు తమను ఈ సినిమాలో చూసుకునే ఫీల్ ఉన్న లవ్స్టోరి. శర్వానంద్, నిత్యామీనన్ చక్కగా నటించారు. గోపిసుందర్, జ్ఞానశేఖర్, సాయిమాధవ్ వంటి మంచి టెక్నిషియన్స్ పనిచేశారు. డైరెక్టర్ క్రాంతి మాధవ్ అందమైన ప్రేమకావ్యంలా సినిమాని తెరకెక్కించారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్రాన్ని ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం'' అన్నారు.
శర్వానంద్, నిత్యమీనన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపి సుందర్, కెమెరా: జ్ఞానశేఖర్ విఎస్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత: కె.ఎ. వల్లభ, దర్శకత్వం: కె. క్రాంతిమాధవ్.