టీడీపీ సీనయర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పాలన కంటే గత జగన్మోహన్ రెడ్డి పాలనే బాగుండేదని ప్రజలు అంటున్నారని అన్నారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఒక యేడాది గడిచిపోయిందన్నారు. అయితే, ప్రజల్లో అపుడే వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రజలు మొహం మీదే తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రావడం లేదని, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బాగుండేదని వారు అంటున్నారన్నారు. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే ఈ దఫా గెలవడం కష్టమేనన్నారు. పథకాలు రావడం లేదని జనం తిడుతున్నారన్నారు.
ఇప్పటికైనా తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమంపై దృష్టిసారించాలని ఆయన కోరారు. లేనిపక్షంలో ప్రజల్లోకి వెళ్లడం కష్టసాధ్యంగా మారుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం కూడా ఎంతో ముఖ్యమన్నారు.