మా తల్లిదండ్రులు ఏ కష్టం తెలియకుండా పెంచడం వల్లే తాను ఇలా తయారైనట్టు నటుడు శింబు చెప్పుకొచ్చాడు. తాను పెడదారి పట్టడానికి, కొన్ని వివాదాల్లో చిక్కుకోవడానికి తన దూకుడు ప్రవర్తేనే కారణమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ యువ హీరో, మాజీ ప్రేయసి నయనతారతో కలిసి నటిస్తున్న 'ఇదు నమ్మ ఆళు' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా శింబు చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'నాకు తొలిసారి కెమెరాముందుకు ఎప్పుడు వెళ్లాననే విషయం కూడా గుర్తు లేదు. నట వారసత్వం ఉన్న కుటుంబం నుంచే నేను వచ్చాను. చాలా యుక్తవయసులో ఉండగానే వెండితెరపై కనిపించాను. నాకు అర్థం చేసుకునే వయసు లేనప్పుడే స్టార్డమ్ వచ్చింది. మా అమ్మవాళ్లే నన్నలా పెంచారు. అందుకే పేరుప్రఖ్యాతలు, స్టార్డమ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. మమ్మల్ని అంతా పనికిరానివాళ్లుగా భావిస్తారు. రేపు నాతో సినిమాలు తీసేందుకు ఏ నిర్మాతా ముందుకు రాకపోయినా.. నాకు తెలుసు.. నా చిత్రాన్ని నేనే తీసుకోగలనని' అని శింబు చెప్పుకొచ్చాడు.
కాగా, శింబు ఇటీవలి కాలంలో పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా బీప్ సాంగ్ వివాదం పెను దుమారాన్నే రేపింది. ఈ వ్యవహారంలో శింబు అరెస్టు నుంచి తృటిలో తప్పించుకున్నారు. అలాగే, తమిళ చిత్రపరిశ్రమ ఎన్నికల సమయంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొన్న విషయం తెల్సిందే.