Savitri 90th birth anniversary
సావిత్రి 90 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ఓ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం చేస్తున్నట్లు ఆమె కుమార్తె విజయచాముండేశ్వరి పేర్కొన్నారు. చెన్నైలో వుంటున్న ఆమె తన తల్లి జయంతి సందర్భంగా తెలుగు చలనచిత్ర రంగంలో పెనవేసుకున్న అభిమానుల కోసం ఈ కార్యక్రమం చేయనున్నట్లు తెలిపారు.
మా మాతృమూర్తీ, మహానటీ అయిన శ్రీమతి సావిత్రి గారి 90వ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్రభారతిలో డిసెంబర్ 1 నుంచి 6 వరకు సావిత్రి మహోత్సవ్' పేరిట నిర్వహిస్తున్నాము. ప్రముఖ కళా సంస్థ “ సంగమం” ఫౌండేషన్ తో కలిసి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో డిసెంబర్ 1 నుంచి 5 వరకు సావిత్రి గారి సినిమాల ప్రదర్శన, పాటల పోటీలు ఉంటాయి. డిసెంబర్ 6న జరిగే సావిత్రి 90 వ జయంతి సభలో 'మహానటి' చిత్ర దర్శక నిర్మాతలైన నాగ్ అశ్విన్, ప్రియాంకాదత్, స్వప్నాదత్ లనూ, 'సావిత్రి క్లాసిక్స్' పుస్తక రచయిత సంజయ్ కిషోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్య లనూ ప్రత్యేకంగా సత్కరిస్తున్నాము. మండలి బుద్ధప్రసాద్ గారి అధ్యక్షతన జరిగే ఈ సభకి భారత పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా, చలన చిత్ర ప్రముఖులు ఆత్మీయ అతిథులుగా విచ్చేయనున్నారు అని విజయచాముండేశ్వరి తెలిపారు.