రాజ్కపూర్ మెచ్చిన ఆ అపరూప థియేటర్ గుడ్బై చెబుతోంది.. నేడే చివరి షో
దాదాపు 80 సంవత్సరాలుగా బ్రిటిష్ పాలకుల నుంచి మొదలుకుని, భారతీయ రాజకీయ నాయకులు, చిత్రసీమ దర్శకులు, నటులు తదితర మహమహులను అలరించి స్వాగతించిన ఢిల్లీలోని ఆ చారిత్రక థియేటర్ శుక్రవారం చివరి షోతో కనుమరుగు క
దాదాపు 80 సంవత్సరాలుగా బ్రిటిష్ పాలకుల నుంచి మొదలుకుని, భారతీయ రాజకీయ నాయకులు, చిత్రసీమ దర్శకులు, నటులు తదితర మహమహులను అలరించి స్వాగతించిన ఢిల్లీలోని ఆ చారిత్రక థియేటర్ శుక్రవారం చివరి షోతో కనుమరుగు కానుంది. బాలీవుడ్కు భావోద్వేగాలను అందించిన మహానటుడు రాజ్కపూర్ సూపర్ హిట్ సినిమాలు సంగం, మేరానామ్ జోకర్ సినిమాల ప్రదర్శనతో ఢిల్లీలోని ఆ పురాతన రీగల్ థియేటర్ శాశ్వతంగా నేటితో తెర వాల్చనుంది. 80 ఏళ్ల థియేటర్ ప్రస్థానం హౌస్పుల్ కలెక్షన్తోనే ఆగిపోనుంది. బాలీవుడ్పై చెరగని ముద్ర వేసిన కపూర్ కుటుంబానికి చెందిన సినిమా, నాటకరంగాలకు వేదికగా నిలిచిన అద్బుత వేదిక అది. చివరి రోజు నాలుగు ఆటలకు కూడా హౌస్పుల్ కలెక్షన్లు వచ్చాయంటే ఆ థియేటర్ ఉజ్వల చరిత్రకు ప్రేక్షకులు ఘన ముగింపు ఇచ్చినట్లే మరి.
1932వ సంవత్సరంలో బ్రిటిష్ పాలనాకాలంలో ప్రారంభమైన ఈ థియేటర్లో ప్రప్రథమ ప్రధానమంత్రి జవాహర్లాల్నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీతోపాటు బిగ్బీ అమితాబ్ బచ్చన్ లాంటి మహామహులు సినిమాలు చూశారు. అలనాటి చలనచిత్ర వైభవాన్ని చాటే చిత్రాలు, నర్గీస్, మధుబాల, దేవానంద్, రాజ్కపూర్ తదితర మహానటుల పోస్టర్లు ఇప్పటికీ రీగల్ కారిడార్లలో కనిపిస్తుంటాయి.
థియేటర్ సిబ్బంది అంతా చివరి ప్రదర్శనకు మానసికంగా సిద్ధమైపోయారని థియేటర్ అకౌంటెంట్ అమర్సింగ్ వర్మ తెలిపారు. శుక్రవారం నాలుగు షోలు ముగిసిన తర్వాత సిబ్బందితో సహపంక్తి విందు ఏర్పాటు చేశామని చెప్పారు. చివరి ప్రదర్శన అయినప్పటికీ టికెట్ల ధరలను మాత్రం పెంచలేదని అన్నారు. ఇదివరకటి మాదిరిగానే రూ.80, రూ.100, రూ.120, రూ.200 గానే ఉంటుందని చెప్పారు. ఇప్పటికే టికెట్లు అన్నీ బుక్ అయిపోయాయని తెలిపారు.
ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో ల్యాండ్మార్క్గా 85 సంవత్సరాలుగా కొనసాగిన రీగల్ థియేటర్ సాయంత్రం రాజకపూర్ తీసిన మేరానామ్ జోకర్ సినిమాను, రాత్రి షోగా సంగమ్ సినిమాను తన చివరి రెండు షోలుగా ప్రదర్శించనుంది. బాలీవుడ్ చిత్ర దిగ్గజం రాజ్ కపూర్ పట్ల సంపూర్ణ గౌరవ ప్రదర్శన తర్వాత రీగల్ శాశ్వతంగా కనుమరుగు కానుంది. రీగల్ థియేటర్ను పిచ్చిగా ప్రేమించిన రాజ్ సినిమాలు తరచుగా ఇక్కడే ప్రదర్శించబడేవి.
మేరానామ్ జోకర్ రాజకపూర్కు అత్యంత ఇష్టమైన, అతి గొప్ప సినిమా. 25 రీల్స్తో కూడిన ఈ సినిమా రెండు ఇంటర్వ్యూలతో నడుస్తుంది. భగ్నప్రేమలోనే జీవితాన్ని పండించుకున్న పాత్రలో జీవించిన రాజ్కపూర్ని చూసే ప్రేక్షకుడికి గుండె బద్దలయిపోతుంది. ఈ సినిమాను చూడడానికి శుక్రవారం అంటే నేడు థియేటర్కి వస్తున్న ప్రేక్షకులు కూడా తమ గుండె బద్దలైన అనుభూతిని పొందక తప్పదు. ఎందుకంటే రేపటినుంచి ఇక్కడ వారు ఏ సినిమాలూ చూడలేరు. 80 ఏళ్ల వయసున్న రిటైర్డ్ బ్యాంకర్ నరేంద్ర గ్రోవర్ ఈ రోజు సినిమా చూసింతర్వాత లండన్ వెళ్లనున్నారు. కాలేజీ రోజుల్లో అతడు రీగల్కి నిత్యం వచ్చేవాడు. మార్పు తప్పదు. లండన్లని రీగల్ థియేటర్ భవంతి వెలుపల ఉన్న ఫలకాన్ని వారు అక్కడ పదిలపర్చారు. ఇక్కడ కూడా వారు అలాగే ఉంచుతారని ఆశిస్తున్నట్లు చెప్పాడు.
ప్రభుత్వోద్యోగి అజాద్ సింగ్ రాజేష్ ఖన్నా ప్రేమ్ నగర్ని (1974) స్కూలు పిల్లాడిగా ఉన్నప్పుడు ఇక్కడే చూసాడు. ఇక ఇక్కడికి చివరిసారిగా వచ్చే యువతీయువకులు సెల్ఫీ తీసుకుని తమ జ్ఞాపకాల్లో థియేటర్ని పదిల పర్చుకోనున్నారు. రీగల్ మేనేజర్ రూప్ ఘాయ్ వద్ద ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ టిక్కెట్లు అడిగేవారితో గురువారం మొత్తంగా బిజీగా రింగ్ అవుతూనే ఉంది. ప్రత్యేకించి చివరి రెండు షోల టిక్కెట్లకు బాగా రద్దీ ఏర్పడింది. పలువురు ఉన్నతాధికారులు నేటి ఆటకు టిక్కెట్ల కోసం వాకబు చేశారని రూప్ చెప్పారు.
రీగల్లో తొలి రోజు, తొలి ఆటను చూడటానికి అప్పట్లో ప్రేక్షకులు రీగల్ థియేటర్ సిబ్బందితో స్నేహాన్ని పెంచుకునేవారట. ఆరోజులన్నీ ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయని రూప్ చెప్పారు. మూతపడుతున్న రీగల్ ఒక పాత, ప్రత్యేక స్నేహితుడు దూరమవుతున్న అనుభూతిని కలిగిస్తోందని చెప్పారు.
ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో 1932లో స్థాపించిన తొలి సినిమా ధియేటర్ రీగల్. వాస్తుశిల్పి వాల్టర్ స్కైస్ జార్జ్ రూపొందించిన ఈ థియేటర్ జార్జియన్ శైలితో ఉంటుంది. దీని గోడలపై దిలీప్ కుమార్, దేవానంద్, మదుబాల, నర్గీస్ వంటి రాజ్ కపూర్ ప్రాణం పోసిన తారలు నలుపు తెలుపు చిత్రాలతో కనిపిస్తారు. 1990లలో ఇతర సింగిల్ స్క్రీన్ థియేటర్ల మాదిరే రీగల్ ప్రాభవం కూడా తగ్గుముఖం పట్టనారంభించింది. మల్టీప్లెక్స్ థియేటర్ల రాకతో సింగిల్ థియేటర్ల వైభవం మసకబారిపోయింది. గత సంవత్సరం చివరలో అమీర్ ఖాన్ సినిమా దంగల్.. రీగల్ థియేటర్లో విడుదలై తాత్కాలికంగా థియేటర్కి జీవం పోసింది కానీ నిర్మాణపరమైన భద్రతా సమస్యల వల్ల అనివార్యంగా థియేటర్ను మూసివేయవలసి వస్తోందని మేనేజర్ రూప్ ఘాయ్ పేర్కొన్నారు.
గురువారం థియేటర్లో పనిచేస్తున్న 20 మంది సిబ్బందికి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. కానీ తమకు భోజనం చేయాలనిపించలేదని, భోరుమని ఏడ్వాలనిపించిందని 55 ఏళ్ల నాయక్ చెప్పారు. మూడు తరాలుగా నాయక్ కుటుంబం రీగల్ థియేటర్ను శుభ్రం చేస్తూ వచ్చింది మరి. ఇకపై మరే పనీ చేయకూడదని నాయక్ నిర్ణయించుకున్నారు.
అయితే థియేటర్గా కనుమరుగువుతున్న రీగల్ మల్టీప్లెక్స్గా అవతరించనుంది. చట్టపరమైన అనుమతులు పొందాల్సి ఉంది. 2019 నాటికి రీగల్ మల్టిప్లెక్స్ను ప్రారంభించగలమని మేనేజర్ రూప్ ఘాయ్ ఆశాభావం ప్రదర్శించారు. రాజ్ కపూర్ తరచుగా ఇక్కడికి వచ్చి ఆట తప్పక నడవాల్సిందే అనేవారని ఘాయ్ గుర్తు చేసుకున్నారు.
అవును ఆట నడవాల్సిందే. థియేటర్ మాయమై కొత్తగా అవతరిస్తున్న మల్టీప్లెక్స్లో అన్నమాట. థియేటర్లో పనిచేసిన సిబ్బందికి మల్టీప్లెక్స్ పూర్తికాగానే పిలిచి ఉద్యోగాలిస్తామని మేనేజర్ చెప్పారు.
అవును మరి. థియేటర్తో మానవీయ బంధాలను పెంచుకున్న తరాలకు చెందిన వారు కదా. తమ సిబ్బందిని తరిమేయడం, మర్చిపోవడం వారికి ఎలా సాధ్యం?