Publish Date: Fri, 12 Feb 2021 (15:15 IST)
Updated Date: Fri, 12 Feb 2021 (15:16 IST)
తాను చాలా క్లిష్ట దశలో ఉన్నానని, తమ గురించి సోషల్ మీడియాలో కామెంట్స్ చేయొద్దంటూ కన్నడ నటి రాగిణి ద్వివేది ప్రాధేయపడింది. కన్నడ చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో ఈమెను బెంగుళూరు నగర సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఇటీవలే ఆమె కోర్టు బెయిల్పై విడుదలయ్యారు. ఆమె తాజాగా సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది.
తనపై, తన కుటుంబంపై కొందరు కామెంట్లు చేస్తూ సంతోషిస్తూ, పైశాచిక ఆనందం పొందుతున్నారని వాపోయింది. తాను వారిని కచ్చితంగా ఒకటి అడుగుతానని, దయచేసి వారంతా ఒకసారి వారు చేసిన కామెంట్లను మరోసారి చదవాలని కోరింది.
వారి కుటుంబ సభ్యులపై ఎవరైనా అలాంటి నెగెటివ్ కామెంట్లు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని అడిగింది. తాను జీవితంలో చాలా క్లిష్టమైన దశలో ఉన్నానని తెలిపింది. ప్రస్తుతం తాను ఎదుర్కొంటోన్న సమస్య గురించి తాను వివరించలేనని చెప్పుకొచ్చింది.
కాలం ప్రతి గాయాన్నీ నయం చేస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పింది. వాటి గురించి భవిష్యత్తులో వివరించి చెబుతానని, తాను సమస్యల్లో ఉన్న సమయంలో తన కుటుంబం తనకు అండగా నిలబడిందని పేర్కొంది.