పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ. సుజీత్ దర్శకుడు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్. డీవీవీ దానయ్య నిర్మాత. ఈ నెల 25 తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం విడుదలకు ముందే సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. పవన్ ఫ్యాన్స్... ఈ సినిమా టిక్కెట్లను రూ.లక్షలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఆ డబ్బులను అభిమాన నేత రాజకీయ పార్టీ జనసేనకు విరాళం రూపంలో ఇస్తున్నారు.
పవన్ కల్యాణ్ అభిమాన సంఘాలు 'ఓజీ' సినిమా ఫస్ట్ డే టిక్కెట్లను వేలం వేయడం ద్వారా భారీ మొత్తంలో నిధులను సమీకరించాయి. ఇలా సేకరించిన విరాళాలను చెక్కుల రూపంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ నాగబాబుకు అందజేశారు. వివిధ నగరాల్లోని అభిమానులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ముఖ్యంగా, బెంగళూరుకు చెందిన అభిమాన సంఘం ఏకంగా రూ.3.61 లక్షల భారీ మొత్తాన్ని విరాళంగా అందించింది. అలాగే చెన్నైలోని పవన్ కల్యాణ్ అభిమానులు రూ.1.72 లక్షలు, చిత్తూరు జిల్లా అభిమానులు రూ.1 లక్ష చొప్పున చెక్కులను పార్టీకి సమర్పించారు. ఈ మొత్తాలను నాగబాబు స్వీకరించి, అభిమానుల నిబద్ధతను ప్రశంసించారు.
తమ అభిమాన నటుడి సినిమా విడుదల వేడుకను కేవలం సంబరంగానే కాకుండా, ఆయన రాజకీయ ప్రస్థానానికి అండగా నిలిచే ఒక అవకాశంగా అభిమానులు భావిస్తున్నారు. సినిమా రంగంలో పవన్ కళ్యాణ్కు ఉన్న అశేష ప్రజాదరణ, ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో చెప్పడానికి ఈ సంఘటనే ఒక నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్లో కనిపించనున్నాడు. శ్రియా రెడ్డి ఓ కీలక పాత్ర పోషించింది. డీవీవీ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.