Publish Date: Sun, 10 Oct 2021 (10:51 IST)
Updated Date: Sun, 10 Oct 2021 (10:54 IST)
మా ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు సినీ తారలు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూళ్లో మా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
మా ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి ఓటు వేయడం విశేషం. ఇక ఓటు వేసిన అనంతరం పవన్ తనను కలిసిన ప్రకాష్ రాజ్, మంచు మనోజ్లను హగ్ చేసుకొని సరదాగా వారితో మాట్లాడారు. ఉల్లాసంగా కనిపించారు. తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకుని మొదటి ఓటును వేశారు. ఈ సందర్భంగా మా ఎన్నికలపై పవన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
తిప్పి కొడితే 900 ఓట్లు కూడా లేవు.. దీనికోసం వ్యక్తిగత దూషణలు అవసరమా అంటూ పవన్ ప్రశ్నించారు. సినిమాలు చేసే వాళ్లు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి కానీ.. ఇలాంటి వ్యక్తిగత దూషణలు ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయని తెలిపారు. మా ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ ఇలాంటి పోటీని చూడలేదని పవన్ తెలిపారు.
సినిమా ఇండస్ట్రీని చీల్చడం అనే సమస్యే ఉండదని తేల్చిచెప్పారు. ఇక మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి అన్న ప్రచారం జరుగుతుందన్న దానిపై పవన్ స్పందిస్తూ వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని తెలిపారు. సినిమాలు చేసే వాళ్లు ఆదర్శంగా ఉండాలంటూ పవన్ చెప్పుకొచ్చాడు.