Publish Date: Mon, 28 Dec 2020 (13:49 IST)
Updated Date: Mon, 28 Dec 2020 (13:55 IST)
బాలీవుడ్ హీరో సోనూసూద్ను అవార్డులు వరిస్తున్నాయి. కరోనా సమయంలో వలసకార్మికులకు కొండంత అండగా నిలబడి వారిని ఆదుకున్నారు. లాక్ డౌన్ మొదలైన నాటినుండి ఆయన ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను సొంత గ్రామాలకు తరలించడానికి ప్రత్యేక బస్సులు, రైళ్లను ఏర్పాటు చేసాడు. ఇక ఇప్పుడు ఏకంగా కేరళలో చిక్కుకున్న ఒడిస్సా అమ్మాయిలను సొంత గ్రామాలకు చేర్చడానికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసాడు.
విదేశాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించారు. అంతేకాకుండా కష్టాలు చెప్పుకున్న ప్రతి ఒక్కరికి లేదనకుండా సాయం చేశాడు. రీల్లో చేసేది విలన్ పాత్రలే అయినా రియల్ లైఫ్లో మాత్రం సూపర్ హీరో అనిపించుకున్నాడు.
ఇలా... లాక్డౌన్ సమయంలో వలస కూలీల పాలిట దేవుడిలా మారిన సోనూసూద్కు అవార్డులు క్యూ కడుతున్నాయి. తాజాగా ఈ రియల్ హీరోకు పర్సన్ ఆఫ్ ది ఇయర్-2020 అవార్డును యూఎన్డీపీ ప్రకటించింది.
కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో సోనూ సేవలకు గానూ ఈ స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డుతో సత్కరించింది. కరోనా వేళ సోనూ తన ఫ్రెండ్ నీతి గోయెల్తో కలిసి ఘర్ బేజో క్యాంపెయిన్ ద్వారా 7.5 లక్షలకుపైగా వలస కార్మికులకు స్వంత ఇళ్లకు చేర్చిన సంగతి తెలిసిందే.