ఈ నెల 10వ తేదీన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి హీరో మంచు విష్ణు పోటీ చేస్తుంటే, ఆయన ప్రత్యర్థిగా ప్రకాష్ రాజ్ బరిలోకి దిగుతున్నారు. దీంతో టాలీవుడ్లో ఎన్నికల కోలాహలం తారాస్థాయికి చేరింది. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు మోహన్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 10వ తేదీ ఆదివారు 'మా' ఎన్నికల పోలింగ్ జరగనుండగా, తన కుమారుడు మంచు విష్ణుకు, అతని ప్యానెల్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 
 
									
										
								
																	
	 
	తాను అందరిలో ఒకడ్నని, నటుడ్ని, నిర్మాతను, దర్శకత్వశాఖలోనూ పనిచేసినవాడ్ని, ఇండస్ట్రీకి కష్టం వచ్చిన ప్రతిసారి నేనున్నాను అంటూ ముందు నిలిచే దాసరి నారాయణరావు అడుగుజాడల్లో నడుస్తున్నవాడ్ని అంటూ వివరించారు. 
 
									
											
									
			        							
								
																	
	 
	టాలీవుడ్లోని 24 క్రాఫ్ట్స్కు చెందినవారి పిల్లలకు, స్వర్గస్థులైన ఎంతోమంది సినీ కళాకారుల పిల్లలకు తమ విద్యాసంస్థల్లో ఉచితంగా చదువు చెబుతున్నానని, వాళ్లు గొప్పస్థాయికి చేరేలా చేశానని మోహన్ బాబు వివరించారు. 
 
									
			                     
							
							
			        							
								
																	
	 
	తాను మా అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో వృద్ధాప్య పెన్షన్లు ప్రవేశపెట్టానని, ఇలా తాను చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయన్నారు. మా అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదని, అదొక బాధ్యత అని మోహన్ బాబు స్పష్టం చేశారు. "ఈసారి మా ఎన్నికల్లో నా కుమారుడు మంచు విష్ణు పోటీ చేస్తున్నాడు. 
 
									
			                     
							
							
			        							
								
																	
	 
	క్రమశిక్షణలోనూ, కమిట్మెంట్లోనూ నా వారసుడు మంచు విష్ణు. నా బిడ్డ ఇక్కడే ఉంటాడు... ఈ ఊళ్లోనే ఉంటాడు... ఏ సమస్య వచ్చినా మీ పక్కన నిలబడి ఉంటాడని మాటిస్తున్నా. అందుకే మీ ఓటును మంచు విష్ణుకు, అతని ప్యానెల్కు వేసి పూర్తిస్థాయిలో ఒక సమర్థవంతమైన పాలనకు సహకరించాలని కోరుతున్నా" అంటూ మోహన్ బాబు తన ప్రకటనలో పేర్కొన్నారు.