యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'జనతా గ్యారేజ్'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నాన్నకు ప్రేమతో తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్నచిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఇంకా సాయికుమార్, సుహాసిని మణిరత్నం తదితరులు నటిస్తున్నారు. ఎన్టీఆర్కు తండ్రిగా సాయి కుమార్ నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్టులుక్ ఈ నెల 20న జూనియర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా ఆడియో రిలీజ్ను కూడా చిత్రయూనిట్ సభ్యులు భారీగా ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో తెలుగు సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ కీలకంగా మారింది. దీంతో ఓవర్సీస్ మార్కెట్ పై పట్టు కోసం, ఈ సినిమా ఆడియోను అమెరికాలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. నాన్నకు ప్రేమతో' హిట్స్తో యంగ్ టైగర్ మంచి జోష్తో వున్నాడు. వైవిధ్యభరితంగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఆగష్టు 12 వరకు వేచి ఉండాల్సిందే.